Potato Side Effects: వంటకాల్లో బంగాళదుంపకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కూరల్లో రాజుగా వెలుగొందే ఆలూ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ఫ్రైలు, కుర్మాలు, చిప్స్ ఇలా రకరకాలుగా దీనిని వాడుతుంటాం. అయితే.. రుచిగా ఉందని చెప్పి ప్రతి రోజూ బంగాళదుంపలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇందులో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అతిగా ఆలూ తినడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బంగాళదుంపలు రుచిగా ఉన్నప్పటికీ.. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆధునిక లైఫ్ స్టైల్ శారీరక శ్రమ తగ్గిన వేళ, ఆలూ అధికంగా తీసుకోవడం మరీ ప్రమాదకరం.
1. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
బంగాళదుంపల్లో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, వీటిని తిన్న వెంటనే శరీరంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ వచ్చే అవకాశం ఉన్నవారు బంగాళదుంపలను నిత్యం తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది.
2. ఊబకాయం, బరువు పెరగడం:
బంగాళదుంపల్లో పిండి పదార్థాలు చాలా అధికం. ఒక గ్రాము పిండి పదార్థం నుంచి సుమారు 4 క్యాలరీలు లభిస్తాయి. మనం వీటిని తరచుగా ఫ్రై రూపంలో లేదా నూనెలో వేయించిన చిప్స్ రూపంలో తిన్నప్పుడు, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే బరువు పెరిగి, ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
3. రక్తపోటు :
ముఖ్యంగా ఉడకబెట్టిన బంగాళదుంపల కంటే.. వేయించిన బంగాళదుంపలు తింటే రక్తపోటు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. వారానికి నాలుగు సార్ల కంటే.. ఎక్కువ బంగాళదుంపలు తినే వారిలో హైపర్ టెన్షన్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4. గ్యాస్, జీర్ణ సమస్యలు:
బంగాళదుంపల్లో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఇది సరిగ్గా అరగదు. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఆలూ తింటే జీర్ణక్రియ మందగించి, మరుసటి రోజు ఉదయం అసౌకర్యంగా అనిపిస్తుంది.
5. సోలనైన్ ప్రభావం:
మనం కొన్ని సార్లు మొలకలు వచ్చిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను వంటల్లో వాడుతుంటాం. వీటిలో ‘సోలనైన్’ అనే సహజ విషపూరిత పదార్థం ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా శరీరంలోకి చేరితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న దుంపలను వాడకపోవడమే మంచిది.
Also Read: సంపూర్ణ ఆరోగ్యంలో నోటి పాత్ర.. ఓరల్ హెల్త్ ఎందుకు అంత ముఖ్యం?
6. గుండె ఆరోగ్యంపై ప్రభావం:
పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
బంగాళదుంపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు పరిమితికి మించి తినడమే అసలైన సమస్య. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తక్కువ నూనెతో ఉడికించిన రూపంలో తీసుకుంటే.. పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ రోజూ ఆలూ ఫ్రైలు, చిప్స్ రూపంలో తీసుకోవడం మీ ఆరోగ్యానికి మీరే ముప్పు తెచ్చుకోవడమే. వీటికి బదులుగా చిలగడదుంపలు లేదా ఇతర పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవడం బెస్ట్. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారపు అలవాట్లలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.