ఇరాన్లో ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయ్. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. ఆందోళనలు సైతం ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ దేశంలో నివసిస్తున్న సుమారు 10 వేల మందికి పైగా భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు మొదలుపెట్టింది.
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపోతోంది. ఇందులో భాగంగా మహాన్ ఎయిర్ ఫ్లైట్ W5-071 విమానానికి తెహ్రాన్కు పంపింది. ఈ విమానం శుక్రవారం అర్ధరాత్రి భారతీయులతో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబికులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. బయటకు రాగానే భావోద్వేగానికి గురయ్యారు. తమవాళ్లు సురక్షితంగా ఇండియాకు చేరుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. పరిస్థితులు చేయి దాటడానికి ముందే ఏర్పాట్లు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇండియాకు తిరిగి వచ్చినవారిలో అక్కడ నివసిస్తున్న భారతీయులతోపాటు పాటు విద్యార్థులు, పర్యటకులు కూడా ఉన్నారు.
ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయులు ఇరాన్లోని పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘అక్కడ ఇంటర్నెట్ లేదు. జనాలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మేం అక్కడ సుమారు నెల రోజుల నుంచి ఉంటున్నాం. గత రెండు వారాల నుంచి పరిస్థితులు క్రమేనా దారుణంగా మారాయి. బయట అడుగు పెడితే చాలు ఆందోళనకారులు చుట్టుముడుతున్నారు. కార్లను అడ్డుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తెలిస్తే మా కుటుంబికులు భయపడతారని తెలిసి.. దాచిపెట్టాం. కానీ, మీడియాలో వస్తున్న వార్తలు చూసి.. ఇండియాకు తిరిగి వచ్చేయాలంటూ మా కుటుంబికులు చెప్పేవారు. సమయానికి ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో మమ్మల్ని సురక్షితంగా ఇండియాకు తిరిగి తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
ఇరాన్లో ఉన్న భారతీయులు అందరినీ ఒకేసారి ఇండియాకు తీసుకురావడం అంత సులభమైన పని కాదని అధికారులు తెలిపారు. ఇరాన్ నలుమూలల్లో ఉన్న భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకుల వివరాలు సేకరించి.. విమానాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గతడాది డిసెంబర్లో ఇరాన్ నేషనల్ కరెన్సీ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఫలితంగా దేశంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి నుంచి అక్కడ నిరసనలు మొదలయ్యాయి. చిన్నగా మొదలైన ఆందోళనలు క్రమేనా ఇరాన్ మొత్తం వ్యాపించింది. నిరసనకారులు రోడ్డుపైకి చేరుకుని జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నారు. ఇలా సుమారు 30 ప్రావీన్స్లలో ఈ ఆందోళనలు ఉగ్రరూపానికి చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సుమారు 1000 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. ఈ ఆందోళనలు విస్తరించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మీడియాను కూడా నియంత్రించింది. అయితే, అక్కడి ప్రభుత్వం మారేవరకు ఈ నిరసనలు కొనసాగే అవకాశాలున్నాయని, అక్కడ నివసిస్తున్న విదేశీయులకు ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోదనే సమాచారంతో భారత ప్రభుత్వం అప్రమత్తమై తరలింపు చర్యలు మొదలుపెట్టింది.
Also Read: ఇరాన్లో రక్తపాతం.. ఇప్పటివరకు 3420 మంది మృతి, ఉరిశిక్షలు నిలిపివేత