Quick Heal launches : సైబర్ దాడులు… ఈ పేరు వింటే వ్యక్తులేకాదు ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో దడ పుడుతుంది. బడా బడా సంస్థలే టార్గెట్ గా మాల్వేర్ తో దాడులు చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. కరోనా వచ్చిన తర్వాత సైబర్ దాడులు మరింత పెరిగాయి. కొత్త కొత్త మార్గాల్లో దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉంటారు. మన దేశంలోని మారుమూలనున్న స్మార్ట్ ఫోన్ వాడే సామాన్యుడిని సైతం దోచేస్తారు. నెట్ వర్క్ లు, సర్వర్లు, స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు… ఇలా ప్రతీది వాళ్ల టార్గెటే. ఒక్కసారి వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటే… బ్లాక్ చేసి డబ్బు డిమాండ్ చేయడం మొదలు పెడతారు. మరి వీళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఒకటే మార్గం.. అదే బెస్ట్ యాంటీ వైరస్ ని సెలెక్ట్ చేసుకోవడం. దానితో రెగ్యులర్ గా స్కాన్ చేయడం. అయితే సాధారణ యాంటీవైరస్ లకు చిక్కకుండా కొత్త రకం మాల్వేర్ లను రూపొందిస్తున్నారు సైబర్ కంత్రీలు. వీళ్ల భరతం పట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సొల్యూఫన్ల సంస్థ క్విక్ హీల్… మాల్వేర్ ని గుర్తించే వర్షన్-23ని తీసుకొచ్చింది. దీన్ని రీసెంట్ గా విడుదల చేసినట్లు తెలిపారు క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా ముప్పు తీవ్రతను ఈ కొత్త వర్షన్ ముందుగానే అంచనా వేస్తుందన్నారు సంజయ్ కట్కర్. డీప్ స్కానింగ్ టూల్స్ తో దాడులను నిరోధిస్తుందని ఆయన వెల్లడించారు. ఫలితంగా సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్, ర్యాన్ సమవేర్ నుంచి రక్షణ వంటి ఫీచర్లతో ఈ కొత్త టెక్నాలజీ పనిచేస్తుందని ఆయన చెప్పారు.
మాల్వేర్ ల దాడుల నుంచి మొబైల్ ఫోన్, డెస్క్ టాప్, ల్యాప్ టాప్, ట్యాబ్ లను రక్షించుకోవాలంటే యాంటీవైరస్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోదు. రెగ్యులర్ గా స్కాన్ చేయాలి. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. సాధారణంగా యాంటీవైరస్ లు ఆటోమేటిగ్గా అప్ డేట్ అవుతుంటాయి. అందుకు అనుగుణంగా సెట్టింగ్ మార్చుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన మొబైల్, కంప్యూటర్లు, ట్యాబ్ లపై సైబర్ క్రిమినల్స్ దాడి చేసే ప్రమాదం ఉంటుంది.