![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/sip.png)
Stock Market : స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా మందికి భయం. ఎందుకంటే, షేర్లు కొన్నాక వివిధ కారణాలంతో ఎక్కడ అవి పడిపోతాయో… పడితే మళ్లీ ఎప్పుడు లాభాల్లోకి వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి… రిస్క్ ఎందుకులే అని చాలా మంది షేర్లకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం స్టాక్మార్కెట్ కంటే రిస్క్ తక్కువైన సిప్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్-సిప్లో… పెట్టుబడులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో… రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్కు భారీగా ఆదరణ పెరుగుతోందంటున్నారు… విశ్లేషకులు.
అక్టోబర్లో సిప్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ యాంఫీ విడుదల చేసింది. ఏకంగా ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో అక్టోబర్లో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయని యాంఫీ వెల్లడించింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మేలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి.
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ ద్వారా ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లు అని యాంఫీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల్లో రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయని… ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 5 నెలల సమయం ఉంది కాబట్టి… నిరుటి రికార్డు ఈసారి చెరిగిపోవచ్చని అభిప్రాయపడింది. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నా… ఇన్వెస్టర్లు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకంతో ప్రతి నెలా సిప్ రూపంలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారని, ఇది చాలా మంచి పరిణామమని యాంఫీ వ్యాఖ్యానించింది. ఇక సిప్ ఖాతాల సంఖ్య చూస్తే… అక్టోబర్లో కొత్తగా 9.52 లక్షలు పెరిగి మొత్తం 5.93 కోట్లకు చేరాయి.