Revanth Reddy: కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పేదల ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై తన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతూనే, ప్రతిపక్షాల వైఫల్యాలను ఏకిపారేశారు. కాంగ్రెస్ హయాంలో 2005-06లో రూ. 2 లక్షలతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీని, నేడు తమ ప్రభుత్వం రూ. 10 లక్షలకు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలన్నీ కేవలం రెండేళ్లలోనే అమలు చేసి చూపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు “గాడిద గుడ్డు” తప్ప ఏమీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని, మెట్రో రెండో విడతకు, మూసీ ప్రక్షాళనకు, రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి దానం చేసిందని, ఆ రెండు పార్టీల శరీరాలు వేరైనా తలలు ఒక్కటేనని విమర్శించారు.
కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చి కేసీఆర్, హరీష్ రావు వేల కోట్లు కొల్లగొట్టారని అమిత్ షా అన్న మాటలు నిజమైతే, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పంపినా CBI విచారణ ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. కేటీఆర్ పాల్పడిన ఫార్ములా-ఈ రేస్ అవినీతిపై విచారణకు అనుమతి కోరుతూ పంపిన లేఖ ఢిల్లీలో ఎందుకు మూలుగుతోందని నిలదీశారు. బీజేపీ నిజంగా అవినీతికి వ్యతిరేకమైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్లను బొక్కలో వేయాలని సవాలు విసిరారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయిన ‘నియామకాల’ను నెరవేరుస్తూ, రెండేళ్లలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, దీనిపై ఎల్బీ స్టేడియంలో చర్చకు సిద్ధమని సవాలు చేశారు. రూ. 20,000 కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచామని, వచ్చే అకాడమీ ఇయర్ నుంచి పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
చొప్పదండికి డిగ్రీ కాలేజీ, కరీంనగర్కు లా కాలేజీ, ఎల్ఎల్ఎం, ఇంజనీరింగ్ కాలేజీలను మంజూరు చేశామని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి ఎంతమంది నాయకులు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేరని, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని చిత్తుగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు నిధులు రావాలన్నా, ఇందిరమ్మ ఇళ్లు అందాలన్నా అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: CM Revanth Reddy: డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలవండి.. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం