![](https://bigtvlive.com/wp-content/uploads/2022/10/STOCK-MARKET-2.jpg)
Sensex : భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరగ్గా… నిఫ్టీ 80 పాయింట్లు పెరిగింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం మన సూచీలకు కలిసొచ్చింది. మెటల్, రియల్, పవర్ సెక్టార్లలోని షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.
ఉదయం 59,792 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్… ఇంట్రాడేలో 59,959-59,496 పాయింట్ల మధ్య ఊగిసలాడి… చివరికి 213 పాయింట్ల లాభంతో 59,756 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 17,737 పాయింట్ల దగ్గర క్లోజైంది. లాభాల్లో మొదలైన సూచీలపై వీక్లీ డెరెవేటివ్స్ ఎక్స్పైరీ ప్రభావం చూపింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాల్లోకి జారుకున్న సూచీలు… చివరి అరగంటలో జరిగిన కొనుగోళ్లతో పుంజుకొని లాభాల్లో ముగిశాయి. ఆర్థికమాంద్యం భయాలతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉందన్న విశ్లేషణలతో… ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆ ఎఫెక్ట్ మన సూచీల్లోనూ కనిపించింది. సెన్సెక్స్30 సూచీలో 23 షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, పవర్గ్రిడ్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టైటన్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడగా… బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా భారీగా లాభపడింది. 34 పైసలు పెరిగి… 82 రూపాయలా 47 పైసల దగ్గర ముగిసింది. గత సెషన్ లో 7 పైసలు బలపడ్డ రూపాయి… గురువారం ట్రేడింగ్ లో ఏకంగా 34 పైసలు బలపడటం విశేషం.