Harish Rao On BC Reservations: ఆరు గ్యారెంటీల లాగే, 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అని ప్రశ్నించారు.
చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నాయకులతో దిల్లీ వేదికగా కోట్లాడాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధమే అన్నారు.
గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం దిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదన్నారు.
‘కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు’ – మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ కు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం రిజర్వేషన్ల పెంపు విషయమై దిల్లీలో కొట్లాడాలన్నారు. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యూల్ 9లో చేర్చేలా చేయాలన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలని, ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని, దిల్లీని నిలదీస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
Also Read: R Krishnaiah: హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన కూడా తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు వాయిదా పడనుంది.