Telangana weather: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుత వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు.ఉదయం తొమ్మిదింటి నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది రహదారిలో జనసంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. జిల్లాలో గత 12 రోజులుగా భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు.అంతేకాకుండా ఉష్ణోగ్రతకు మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. జిల్లాలో 40 నుంచి 43.3 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు బయట తిరగవద్దని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు డిహైడ్రేషన్ కు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి కొన్ని రోజులు ఇలాగే వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణం నిపుణులు సూచిస్తున్నారు.
ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు కూలర్లు వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త వాటిని కొనుగోలు చేయడం పెరిగింది. సంపన్నులు,మధ్యతరగతి వారు ఏసీలు కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతుండగా పేదలు కూలర్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2500 ల రూపాయల నుంచి 8 వేల రూపాయల మధ్య కూలర్లు దొరుకుతుండడంతో వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొందరు ఉన్న వాటిని దుమ్ము దులిపి రిపేర్ చేపించుకునే పనిలో పడ్డారు. అటు వ్యవసాయం చేసుకునే రైతులు, కూలీలు ఉదయం సాయంత్రం వేళల్లో పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. వృద్ధులు,చిన్నారులు ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక బయటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఉక్కపోత ఉండి గాలి లేకపోవడంతో శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది.
Also Read: 30 ఏళ్ల స్థిరత్వం ఒక్క యుద్ధంతో.. గల్ఫ్ దేశాల కళ్లముందే కరుగుతున్న కల!
ఈ నేపథ్యంలో చల్లదనం కోసం ఏసీల కొనుగోలుపై ఆసక్తి చూపుతుండగా గతం కన్నా ఇప్పుడు ఏసీల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఏసీలు 30,000 లకు దొరికేవి. ప్రస్తుతం 40 వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. ఎండలు పెరగడంతో కుండల కొనుగోలు కూడా పెరిగాయి. కొత్త కుండలు తీసుకెళ్లి చల్లని నీరు తాగుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనానికి ప్రజలు కూలర్లు, ఏసీల వాడకంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. చల్లదనం కోసం ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లలో దొరికే మజ్జిగ,పండ్ల రసాలు, చెరుకు రసం, కొబ్బరి బోండాలతో పాటు తాటి ముంజల వినియోగానికి ప్రజలు వాలి పోతున్నారు.
గద్వాల 43.3
ఐజ. 42.1
ధరూర్. 41.5
మల్దకల్. 42.6
వడ్డేపల్లి 42.4
గట్టు. 42.4
ఇటిక్యాల 42.0
రాజోలు 41.9
కేటి దొడ్డి 41.9
ఉండవెల్లి 41.4
అలంపూర్ 40.7
ఎర్రవల్లి. 40.4
మానవపాడు 40.6
Also read: ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!