Palnadu District: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేటలోని బాలయ్య నగర్కు చెందిన 22 ఏళ్ల రమాదేవి అనే యువతి ఒక చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో.. బయటపడ్డ నిజం..
ఆపరేషన్ పూర్తయిన తర్వాత రమాదేవికి తీవ్రమైన నొప్పి రావడంతో, ఆమె వెంటనే ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే, సిబ్బంది ఆ నొప్పిని పట్టించుకోకుండా, అది ఆపరేషన్ తర్వాత సహజమే అంటూ కొట్టిపారేశారు. నొప్పి తట్టుకోలేక బాధితురాలు మరోసారి ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా, ఆమె తొడ దగ్గరలో ఒక సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు.
సర్జికల్ బ్లేడుని చూసి కంగుతిన్న బాధిత మహిళ బంధువులు
దీంతో యువతి శరీరంలో బ్లేడు ఉన్న విషయం తెలియగానే బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది ఘోరమైన నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, వెంటనే వారు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలు రమాదేవి మాట్లాడుతూ, ఆపరేషన్ కోసం ఆసుపత్రి సిబ్బంది తమ నుంచి రూ. 2,500 వసూలు చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ స్వామి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
ఈ ఘటనపై స్పందించిన ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి..
ఈ ఘటనపై ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి వివరణ ఇచ్చారు. యువతి కడుపులో దగ్గర సర్జికల్ బ్లేడు ఉండటం తన తప్పు కాదని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పూర్తయిన వెంటనే మరో కేసు ఉండటం వలన తాను వెళ్లిపోయానని, ఆపరేషన్ థియేటర్ క్లినింగ్ చేసే సిబ్బంది సరిగా శుభ్రం చేయకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చారు. అంటే, సర్జికల్ బ్లేడును తొలగించి, కుట్లు వేసిన తర్వాత, మిగిలిన క్లీనింగ్ ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డాక్టర్ నారాయణ స్వామి తెలిపారు.