సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 చోట్ల కాంగ్రెస్ మద్ధతుదారులు గెలవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం రేషన్ కార్డు, ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలంతా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థినే గెలిపించాలని కోరారు. కోదాడ, హుజూర్నగర్ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరా తీశారు. మహిళా విశ్వవిద్యాలయం వేధింపుల కలకలం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాజాసింగ్ ఆదేశించారు. విద్యార్థినుల భద్రత కోసం మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వీసికి సూచించామని రాజాసింగ్ చెప్పారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోమవారం ఇండిగో సిబ్బంది తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్లు ఉన్నా, సమయం అయిపోయింది అని చెప్పి ప్రయాణికులను గేట్ వద్దే నిలిపివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశిగూడెంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్, బీఆర్ఎస్ అభ్యర్థి హఫీజ్లకు సమానంగా 164 ఓట్లు పోలయ్యాయి. దీంతో సర్పంచ్ ఎంపికను టాస్ ద్వారా నిర్వహించారు. టాస్ గెలిచిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సత్తార్ను అధికారులు సర్పంచ్గా ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పెనుబల్లి మండలం బంజర్ రింగ్ సెంటర్లో గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ నుంచి మూడు పెద్ద గ్రానైట్ రాళ్లు అకస్మాత్తుగా కిందపడ్డాయి. లారీ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో వివాహిత మృతి కేసులో ఆమె భర్త, అత్త, మామ, మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు కట్నం కోసం భర్త వేధించాడని, అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతి తర్వాత పరారైన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ యూనివర్సిటీలో మెస్ ఇంఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో, వీసీ దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత విద్యార్థినులు రహస్యంగా ఆడియో రూపంలో షీ టీమ్స్కు ఆన్లైన్లో కంప్లైంట్ చేయడంతో, షీ టీమ్స్ కూడా దర్యాప్తు ప్రారంభించాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో కాంగ్రెస్ అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మొత్తం 1,834 ఓట్లు పోల్ అవ్వగా.. బుచ్చిరెడ్డికి 909 ఓట్లు, సమీప అభ్యర్థి తిప్పని కాంతి రెడ్డికి 908 ఓట్లు వచ్చాయి. బుచ్చిరెడ్డి ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో సఫారీ పర్యాటకులకు మరోసారి పెద్దపులి దర్శనమిచ్చింది. నిజాం బంగ్లా సమీపంలో అకస్మాత్తుగా పులి ప్రత్యక్షం కావడంతో పర్యాటకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పులిని తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమెరికాతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అమెరికా కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్తో సమావేశం అనంతరం, RTA సేవలు అమెరికాలో ఉపయోగకరంగా ఉంటాయని సీఈవో దాత్రి రెడ్డి తెలిపారు. RTA, USA స్టార్టప్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్ ప్లాట్ఫామ్పై అవకాశం దక్కడం సంతోషకరమన్నారు.
అనంతపురం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎర్ర కాలువపై చేసిన ఆరోపణలు అవాస్తవమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఎవరైనా కాలువను ఆక్రమించి ఉంటే, పెద్దారెడ్డి వచ్చి చూపించాలని, తాము వాటిని కొట్టేస్తామని సవాల్ చేశారు. పెద్దారెడ్డి తన ఆరోపణలను నిరూపించకపోతే తమ కౌన్సిలర్లు నిరసన తెలుపుతారని జేసీ హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యనమదుర్రులో డ్రైనేజీలో భారీ కొండచిలువ బయటపడటం కలకలం రేపింది. డ్రైయిన్ నుండి బోధిలోకి ఇంజన్ ద్వారా నీటిని తోడుతుండగా..20 అడుగుల భారీ కొండచిలువ బయటకు వచ్చింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ పహాడీ షరీఫ్లో దారుణం జరిగింది. ఓ బాలికను కిడ్నాప్ చేసి, జల్ పల్లిలోని ప్లాస్టిక్ కార్ఖానాలో బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది మైనర్ బాలుడని, అతడికి మరో ఇద్దరు సహకరించారని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ఇంఛార్జీలను నియమించింది. తమిళనాడుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎలక్షన్ ఇంఛార్జీగా నియమితులయ్యారు. అస్సాం ఎన్నికల ఇంఛార్జీగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్ పాండాను నియమించారు. ఇతర కో ఇంఛార్జీలను కూడా ప్రకటించారు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కతాలో నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి, గందరగోళం సృష్టించినందుకుగాను శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో యూదులపై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన తండ్రీకొడుకులు నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్లకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కారులో రెండు ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి రెండు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీపై బీజేపీ నేత నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నిఘా కోసం ఉత్తరాఖండ్లోని నందాదేవీ పర్వతంపై అణు ఆధారిత నిఘా పరికరం అమర్చేందుకు అమెరికాకు ఈ ఇద్దరు మాజీ ప్రధానులు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం నరసింహ రీ రిలీజ్ సందర్భంగా.. స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. సినిమా చివరిలో చొక్కా తీసేసి రజనీకాంత్ ఫైట్ చేశారనే సంగతి తెలిసిందే. దాన్ని తీసిన విధానానికి ఫిదా అయిన రజనీకాంత్.. నీకేం కావాలి? డైమండ్స్ ఓకేనా? అని తనను అడిగారట. దానికి బదులుగా తాను రుద్రాక్షను కోరానని తెలిపారు.
దక్షిణాఫ్రికాతో ధర్మశాల టీ20లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అర్ష్దీప్ సింగ్ తన బౌలింగ్పై సంతృప్తి వ్యక్తం చేశాడు. రీజా హెండ్రిక్స్ ఎల్బీడబ్ల్యూ విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆలస్యంగా డీఆర్ఎస్ తీసుకోవడంపై మాట్లాడాడు. ఆయన సస్పెన్స్ కోరుకున్నారు, అందుకే రివ్యూ తీసుకోవడానికి సమయం తీసుకున్నారు అని తెలిపాడు.