ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలకు టీడీపీ నూతన జిల్లా అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియమించింది. సామాజిక సమీకరణాలను పాటిస్తూ.. అధ్యక్ష పదవుల్లో 11 ఓసీ, 8 బీసీ, 4 ఎస్సీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ వర్గానికి కేటాయించారు. ఎన్నికల అనంతరం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే లక్ష్యంతో అధిష్ఠానం ఈ నియామకాలు చేపట్టింది.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
హైదరాబాద్లోని నల్లకుంటలో బిగ్ టీవీ, సీజన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సామాజిక బాధ్యతలో భాగంగా బిగ్ టీవీ చేపట్టిన కార్యక్రమంలో ఇది 600వ మెడికల్ క్యాంప్ కావడం విశేషం. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటివరకు 599 శిబిరాలను బిగ్ టీవీ విజయవంతంగా పూర్తి చేసింది.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ట్రాక్టర్లో తలెత్తిన లోపం వల్ల మంటలు చెలరేగి, నిల్వ ఉన్న పత్తితో పాటు ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు అగ్నిమాపక వాహనాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో మిల్లుకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.
సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1557 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, చెక్ బౌన్స్, మనీ రికవరీ వంటి కేసులను ఇక్కడ త్వరగా పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని నేతలు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ జెండా పట్టుకుని పోరాడిన వారికే అసలైన హక్కు ఉంటుందని, బెదిరింపులకు పాల్పడే వారికి భయపడాల్సిన అవసరం లేదని నూతన పాలకవర్గ సభ్యులకు ధైర్యం చెప్పారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే సీఎం స్థాయికి ఎదిగారని, కేటీఆర్ లాగా పారాచ్యూట్ నేత కాదని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ విజయంతో కేటీఆర్లో ఫ్రస్టేషన్ పెరిగిందని, బీఆర్ఎస్ ఓటములకు కేటీఆర్ ‘ఐరన్ లెగ్’ కారణమని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. ప్రాజెక్టుల పరిశీలన, నిర్వాసితులకు పరిహారం అందేలా చేయడమే లక్ష్యంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పత్తి రైతుల సమస్యలు, ఆలయాల్లో వసతుల లేమిపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. MGNREGS పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేశారు. పేదల కోసం ఒక్క పథకం తీసుకు రాలేని బీజేపీ.. జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం గాంధీని అవమానించడమే అని ఆరోపించారు.
MGNREGS పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడంతో మహబూబాబాద్ జిల్లాలోని గాంధీ పార్క్ వద్ద ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న వీబీ జీ రామ్జీ బిల్లు పేద ప్రజలకు శాపం అని ఎంపీ బలరాం నాయక్ అన్నారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో నూతన పాలకవర్గాలను సత్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ జెండా మోసిన తమకే పార్టీపై పూర్తి హక్కు ఉంటుందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పట్ల నిబద్ధత లేని నేతల బెదిరింపులకు భయపడవద్దని కార్యకర్తలకు సూచించారు.
సంగారెడ్డి జిల్లా వెల్నెస్ ఆసుపత్రి వద్ద ప్రతాప్ రెడ్డి కుటుంబసభ్యుల ఆందోళనతో హైటెన్షన్ నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సకు రాగా, డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే ప్రతాప్ రెడ్డి కోమాలోకి వెళ్లాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించాక వేరే ఆసుపత్రికి వెళ్లమనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతి, కాళేశ్వరం దోపిడీపై నాడు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబంపై సీబీఐకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తూ.. రేవంత్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
చిత్తూరులో జగన్ జన్మదిన వేడుకలు వైసీపీలోని వర్గ విభేదాలను బయటపెట్టాయి. ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఒకచోట వేడుకలు జరపగా, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరోచోట సంబరాలు జరిగాయి. ఇన్ఛార్జ్ తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని అసంతృప్త నేతలు మండిపడుతున్నారు. బ్యానర్లలో విజయానంద్ రెడ్డి ఫోటోలు లేకపోవడం పార్టీలో రాజుకుంటున్న ముఠా తగాదాలకు నిదర్శనంగా నిలిచింది.
అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా అపాయింట్మెంట్లు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు కీలక సూచనలు జారీచేసింది. అమెరికాను వీడి ఇప్పట్లో బయటకు వెళ్లకండంటూ కొందరు ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అడ్వైజరీని జారీచేసింది. బయటకు వెళితే అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమవుతుందని, ఇందుకోసం ఉద్యోగులు నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తుందని అడ్వైజరీలో గూగుల్ తెలిపింది. అమెరికా వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఓ పాఠశాలలో జరిగిన లైవ్ కాన్సర్ట్లో భక్తి పాటలు పాడుతుండగా, ‘సెక్యులర్’ పాటలు పాడాలని మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపై దాడికి ప్రయత్నించాడని బెంగాలీ సింగర్ లగ్నజిత్ చక్రవర్తి ఆరోపించారు. ఈ ఘటనపై తొలుత ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారని, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నారని అన్నారు.
ఇండియన్ రైల్వే శాఖ.. ఛార్జీలను స్పల్పంగా పెంచింది. ఈ నెల 26 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు మాత్రం ఛార్జీలను పెంచలేదు. 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణాలకు.. ఆర్డినరీ క్లాస్లో కిలో మీటరుకు ఒక్క పైసా, మెయిల్, ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీలకు కిలో మీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది.
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.
హీరో రోషన్ నటిస్తున్న కొత్త చిత్రం ఛాంపియన్ ఈనెల 25న విడుదల కానుంది. నటుడిగా తనను తాను మలుచుకోవడానికి ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే విరామం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు సరైన పరిణతి, మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని, ప్రతి సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వాలని రోషన్ ఆకాంక్షించారు.