సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.
విజయవాడ దుర్గగుడిలో విద్యుత్ నిలిచిపోయిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని, దీనిపై సమగ్ర నివేదిక కోరామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా చిలుకూరి బాలాజీ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా విద్యాధికారి అశోక్ ఘనంగా ప్రారంభించారు. విజయ విద్యామందిర్ పాఠశాలలో రెండు రోజుల పాటు జరిగే ఈ మేళాలో విద్యార్థుల మేధాశక్తిని ప్రతిబింబించే ప్రయోగాలు ప్రదర్శించారు. 35 ఏళ్ల తర్వాత ఇక్కడ సైన్స్ ఫేర్ నిర్వహించడం గర్వకారణమని అతిథులు పేర్కొన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త కార్యదర్శిగా నిర్మాత మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షతన ఏర్పడిన నూతన కార్యవర్గంలో భాగమైన ఆయన, పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సాయిరామ్ ఫుడ్స్ కార్ఖానాలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్ఖానాలో అపరిశుభ్ర వాతావరణం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కర్లకు మెడికల్ రిపోర్ట్స్ లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తూ కూటమి నేతలు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. YRS సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో కూటమి నేతలతో పాటు పెద్దఎత్తున విద్యార్థులు, జేఏసీ నేతలు పాల్గొన్నారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూనే.. వేడుకల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రిసార్టులలో డీజేలు ఏర్పాటు చేయడం, మైనర్లను అనుమతించడంపై నిషేధం విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 100కు డయల్ చేయాలని తెలిపారు.
కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం మూడేళ్లుగా శిలాఫలకానికే పరిమితం కావడంతో వైకుంఠ ఏకాదశి నాడు కోట శ్యామ్కుమార్ అనే యువకుడు వినూత్న నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం భూమి పూజ చేసి వదిలేసిందని, వచ్చే ఏడాదికైనా స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా దర్శిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోట వినుత డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో చెన్నై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీడింగ్స్లో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఉండటంతో ఆయనకు సమన్లు ఇచ్చి స్టేట్మెంట్ తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఇప్పటికే పేటా బ్రదర్స్, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయిని పోలీసులు విచారించారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీరుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ను పడగొట్టి గుంటూరును సర్వనాశనం చేశారని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని గాలాయగూడెం రైతు సేవా కేంద్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ అంటించారు. ఈ చర్యను చూసి ఆగ్రహించిన గ్రామస్థులు, సత్వరమే ఆ ఫ్లెక్సీని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పేదలకు తీపి కబురు అందించారు. 2026 నాటికి 6,000 పైగా కుటుంబాలకు ఫ్లాట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. తొలి దశలో సావ్దా ఘెవ్రాలో 2,500 కుటుంబాలకు విద్యుత్, నీరు, మరుగుదొడ్ల సౌకర్యాలతో కూడిన ఇళ్ల తాళాలను అందజేయనున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం పట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆ దేశ గమనాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు, బంగ్లాదేశ్ ప్రజలకు ఖర్గే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దక్షిణ అమెరికాలోని అతి పెద్ద డ్రగ్స్ కేంద్రంపై దాడి చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. వెనెజువెలాపై ఒత్తిడిలో భాగంగా ఈ దాడి చేశామని వివరించారు. డ్రగ్స్ను సరఫరా చేసే ఓడలతో ఈ కేంద్రానికి సంబంధం ఉందని పేర్కొన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 7-12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ముంబైలో రోడ్డు ప్రమాదం జరిగింది. భండూప్ వెస్ట్లో బస్సును వెనక్కి తిప్పుతుండగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2026 టీ20 వరల్డ్కప్, న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. గిల్కు మద్దతుగా నిలిచిన హర్భజన్.. అతడు ప్రతిభావంతుడని, త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ మలేసియాలో అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ వేడుక అరుదైన ఘనత సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.