హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం నగరాన్ని 12 జోన్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించింది. కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై సీఎం దృష్టి సారించారు. పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో 180 జతల ఎడ్లు పాల్గొని రికార్డు సృష్టించాయి. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని నేతలు కొనియాడారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గోదావరి నీటిని కృష్ణాలో కలిపితే తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే సీఎం చంద్రబాబు రూట్ మార్చారని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త ఎత్తుగడలని ఆరోపించారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్య వైశ్య యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైని వీఆర్కు పంపినట్లు మంత్రి వీరాంజనేయస్వామి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, హోం మంత్రి స్వయంగా భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వనపర్తిలో జిల్లాలో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోయి శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్పై దాడికి పాల్పడ్డారు. బైక్ను ఢీకొట్టడమే కాకుండా, రాయితో తల మీద కొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో బొలెరో వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోహర్, సత్యనారాయణ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మాదాపూర్ పర్వత్ నగర్ వద్ద వేగంగా వచ్చిన కారు ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీమ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోమ్ గార్డ్ కాలు విరగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. నిందితుడు పరారు కాగా, పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, లారీని ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన రామప్రభు, అనఘలను చికిత్స కోసం నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో వన్ టౌన్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. అలజడి కావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాల్కొండ వైపు పరారైన దొంగలను పట్టుకునేందుకు ఇందవాయి టోల్ గేట్తో పాటు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు.
ప్రభుత్వ భూమి బదలాయింపులో అవకతవకలకు పాల్పడినందుకు ఖమ్మం జిల్లా పెనుబల్లి తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్, జీపీఓ రవిలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. సీలింగ్ భూమిని ఇతరులకు కట్టబెట్టినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో వారం రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. తడోబా నిపుణులు, 6 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, 15 ట్రాప్ కెమెరాలతో అధికారులు గాలిస్తున్నారు. తొగుట మండలంలో పాదముద్రలు గుర్తించిన నేపథ్యంలో, రైతులు అడవి వైపు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2025లో 2,150 కేసులు నమోదవగా, తాజాగా మరణాల సంఖ్య 22కు చేరింది. గత మూడేళ్లుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కాగా, కాకినాడ, విశాఖపట్నం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. అల్లూరి జిల్లా అధికారులకు పోలవరం బాధ్యతలు, ప్రకాశం జిల్లా అధికారులకు మార్కాపురం బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా రంగారెడ్డిపల్లి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని డీసీఎం వాహనం దగ్ధమైంది. వాహనంలో మంటలు చెలరేగి, డ్రైవర్ వెర్రిస్వామి సజీవ దహనమయ్యారు. కాకినాడ నుంచి అనంతపురానికి డ్రై ఫ్రూట్స్ తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహానికి దుండగులు నిప్పుపెట్టారు. అయితే రాజకీయ కక్షలతోనే కాంగ్రెస్ శ్రేణులు ఈ విగ్రహాన్ని తగులబెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
భారత్- పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ క్రెడిట్ను ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే తన వాణిజ్య హెచ్చరికల వల్లే ఇరు దేశాల శాంతించాయని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చైనా కూడా తాము శాంతికాముకులమని, యుద్దాలను ఆపడంలో పాత్ర పోషించామని కొత్త రాగం అందుకుంది.
గిరిజనాభివృద్ధికి విద్యే కీలకమని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. విద్యావంతులు గ్రామాలకు వెళ్లి స్థానికులకు అవగాహన కల్పించాలని కోరారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం అంతమవుతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత నౌకాదళ అధికారి కుమార్తె కామ్యా కార్తికేయన్ 18 ఏళ్లకే స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధ్రువాన్ని చేరుకుని రికార్డు సృష్టించారు. మైనస్ 30 డిగ్రీల చలిలో 115 కి.మీ ప్రయాణించి ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ వ్యక్తిగా నిలిచారు. ఇప్పటికే ఆమె ఎవరెస్టు సహా ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం విశేషం.
టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పునరాగమనం మరికొంత ఆలస్యం కానుంది. గాయం వల్ల బరువు, శక్తి కోల్పోయిన అతడికి బెంగళూరు సీఓఈ నుంచి ఇంకా అనుమతి లభించలేదు. ఫిట్నెస్ సాధించేందుకు మరో వారం అక్కడే ఉండాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే కాంబినేషన్లో కొత్త సినిమా అధికారికంగా ప్రకటించబడింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సిద్ధుకి ఆ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.