మహబూబాబాద్ జిల్లా ములకపల్లిలో రోడ్డు విస్తరణలో భూ నిర్వాసితులకు చెల్లించిన నష్టపరిహారంలో అవినీతి జరిగిందని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా చూపించి కోట్లాది రూపాయలు కాజేశారని, రి-సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
మన్యం జిల్లా వీరఘట్టంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టించాయి. నిన్న రాత్రి కోటదుర్గ అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. సీసీ టీవీ ఫుటేజ్ కోసం DVRను, హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారు. పోలీసులు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని, దర్యాప్తును ముమ్మరం చేశారు.
భునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల నిర్మాణ పనుల కోసం 485 కోట్లు మంజూరైనట్లు తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి. రైతులకు భూసేకరణ డబ్బులు త్వరలో చెల్లిస్తామని, పనులకు సహకరించాలని కోరారు. ఏప్రిల్లో మూసీపై పనులు మొదలవుతాయన్నారు ఎమ్మెల్యే.
వైజాగ్లో సీఐఐ సదస్సుకు ఆదరణ కరువైందని ఆరోపించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. హిందూపూర్లో వైసీసీ కార్యాలయంపై టీడీపీ దాడిని ఖండిస్తూ కాకినాడలో నల్ల కండువాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని విమర్శించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూడు నెలలుగా తమ సమస్య పరిష్కారం కావడం లేదని దోమడగు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెటిరో పరిశ్రమతోపాటు చుట్టుపక్కల ఉన్న కంపెనీల పొల్యూషన్తో.. నల్లకుంట చెరువులోని నీరు గులాబీ రంగులోకి మారాయని ఆరోపించారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ ఎదుట బాటిళ్లలో తెచ్చిన నీళ్లు పోసి నిరసన తెలిపారు.
సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ బీఆర్ గవాయి.. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. కోర్టు ధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు 8 వారాల సమయం కోరుతూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్ గోషామహల్లో ఓ భవనం కుంగింది. చాక్నవాడిలోని 5 అంతస్థుల బిల్డింగ్ పక్కన నిర్మిస్తున్న కొత్త భవనం పిల్లర్స్ కోసం తవ్వడంతో ఈ బిల్డింగ్కు పెద్ద క్రాక్ కూడా వచ్చింది. సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం అందించినప్పటికీ.. 6 గంటలైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్రానికి పెట్టుబడుల పండుగ ముందే వచ్చేసిందని చెప్పారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఐఐ సమ్మిట్ ఏపీ దశా, దిశా చంద్రబాబు అని.. కూటమి కృషి వల్ల ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 13 లక్షల ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
సెక్రటేరియట్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రేపు రాష్ట్రానికి రావాలని సీసీఐ సీఎండీ, అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ. డిసెంబర్ 31న రోడ్డును ప్రారంభిస్తానని.. రద్దీ ప్రాంతం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ సైడ్ రోడ్ పనులు తొలివిడతగా చేపట్టామని ఆయన అన్నారు. రెండో సైడ్ రోడ్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి.. ఫిబ్రవరి 15న ఆ రోడ్డును ప్రారంభిస్తాని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బొలెశెట్టి శ్రీనివాస్. నాకు భగవంతుడు ఆయుష్షు ఇవ్వలేదు.. తీసికువెళ్ళిపోతాడని ఆయన అన్నారు. అనుకుంటే తన ప్లేస్ మరో నాయకుడు వస్తాడని.. లేదా తమ నాయకుడుకి తను నచ్చలేదంటే తనని మార్చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో TUFIDC ద్వారా మంజూరైన నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బిటి రోడ్డు నిర్మాణం పనుల శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మందుల సామేలు. తుంగతుర్తి నియోజకవర్గంలో 153 గ్రామ పంచాయతీలు ఉన్నాయని.. ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం పాల్వంచ సొసైటీల పరిధిలో 16 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు కూనంనేని.
తూర్పుగోదావరి జిల్లా పాత తుంగపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి గాదంశెట్టి ఏలిష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు ఆవుతున్నారు. ట్రాన్స్ఫర్ రిపేర్ చేస్తుండగా.. ఈ జరిగిన ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి ఎండీ ఫరూక్. ఏపీ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ CII సమ్మిట్ నిలిచిందని మంత్రి అన్నారు. ఏపీని పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని చెప్పారు.
బెంగళూరులో ఓ మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని 32కోట్లు పోగొట్టుకున్నారు. సీబీఐ అధికారులమంటూ.. ఫోన్ చేసిన మోసగాళ్లు, ఆమె పేరు మీద నిషేధిత వస్తువులున్న పార్శిల్ వచ్చిందని నమ్మించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి డబ్బు బదిలీ చేయాలని బెదిరించారు. దీంతో భయపడిన మహిళ.. ఆరు నెలల్లో 187 బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా 31.83 కోట్లు ట్రాన్సఫార్మ్ చేసింది.
ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు విచారణలో అల్ ఫలా యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడిని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించిన అనుమానితులకు యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో, యూనివర్సిటీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణకు జావెద్ సిద్దిఖీ స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఫరీదాబాద్ ఉగ్రవాద కేసు దర్యాప్తులో భాగంగా జావెద్కు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు సమన్లు జారీ చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. బంగ్లా హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని పేర్కొంది. ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని ‘AB4’ మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రవీనా టాండన్ కుమార్తె రషా తడానిని ఖరారు చేశారు. తాజాగా రషా లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. సాఫరీ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తెశారు. టీమిండియా జట్టుపై దక్షిణాఫ్రికా 15 ఏళ్ల తర్వాత టెస్టు విజయం సాధించారు. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు. స్పిన్కు ఎక్కువగా అనుకూలించే పిచ్లను తయారుచేయడం.. టెస్టు క్రికెట్ భవిష్యత్ను నాశనం చేస్తుందని ఆయన విమర్శించారు. ఇలాంటి పిచ్లపై సమర్థుడైన బౌలర్, బ్యాట్స్మెన్ల మధ్య తేడా ఉండదని చెప్పారు హర్భజన్.