రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే భగవాన్ సత్యసాయి బాబా మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. మానవసేవే మాధవసేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారని.. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని ఆయన గుర్తు చేశారు. 102 విద్యాలయాలు నెలకొల్పారని… ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని చెప్పారు చంద్రబాబు.
విజయవాడలో సీఐఐ సదస్సుపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31లక్షల ఉద్యోగాలు అని ఫేక్ అన్నారు. MOUల పేరుతో చంద్రబాబు.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టుల మృతదేహాలను తరలించారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మావోయిస్టుల మృతుల బంధువులు అక్కడకి చేరుకున్నారు. ఏరియా ఆస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. పోలీసులు విడుదల చేసిన జాబితాలో దేవ్ జీ పేరు లేకపోవడంతో… దేవ్ జీ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన్ను చూపెట్టాలని దేవ్ జీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల జాయింట్ అకౌంట్లో ఉన్న.. బాధితుడి 2.5 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. తిరుపతికి చెందిన బాధితడు సీనియర్ సిటిజన్ నుంచి 80లక్షలు దోచుకున్నారు. దర్యాప్తు చేయగా విదేశీ నెట్వర్క్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు. ఎన్కౌంటర్ల భయమున్న మావోయిస్టులు మీడియా ముందు లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని వెల్లడించారు.
ఇటీవల వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హన్మంతునిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత మాధవి లత. బాహుబలి సినిమాలో ప్రభాస్తో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారని.. అప్పుడేమైనా ఏ శివాలయానికైనా దానధర్మాలు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజు రాజమౌళి చేసింది ఏం లేదని.. ఇప్పుడు ఆంజనేయ స్వామిని తిట్టడం ఎందుకు అని ఘాటుగా స్పందించారు మాధవి లత.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని.. డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. అర్హులను కాదని, అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన చేస్తున్నారు. దీంతో నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
నాగర్కర్నూల్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దళారులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మాటు వేసి రైతుల నుంచి తక్కువ ధరకు విక్రయించి.. వేరే రైతుల సహకారంతో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది ఓ మహిళ. తన భర్త సోదరులు కొట్టారని, ఫిర్యాదు చేస్తే ఎస్సై పట్టించుకోలేదని మహిళ ఆరోపించింది. 3 నెలలుగా ఎస్సై తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
కర్ణాటకలో ఓ భారీ నీటి కాల్వలో పడిపోయిన ఏనుగును అక్కడి అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఈ నెల 15న మాండ్యా జిల్లా శివనసముద్ర సమీపంలోని ఒక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కాలువలో నీరు తాగడానికి వచ్చిన 12 ఏళ్ల ఏనుగు..అందులోకి దిగి బయటకు రాలేకపోయింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో..అక్కడే చిక్కుకుపోయింది. అయితే 16వ తేదీన ఏనుగును గమనించిన ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఉద్యోగులు..అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్ మెంట్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. టౌన్ ప్లానింగ్ సెక్షన్.. ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు, నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులు నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు తెలిపారు అధికారులు.
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా నక్సల్స్ అణచివేతే మా లక్ష్యమన్నారు. పౌరహక్కుల నాయకులే నక్సలిజం అంతరించిందని ఒప్పుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ పాలనలో అర్బన్ నక్సలైట్లు ప్రభుత్వంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములయ్యారని బండి సంజయ్ తెలిపారు.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి వద్ద రైల్వే పనుల్లో భాగంగా ఒరిగిన విద్యుత్ స్తంభం పక్కనే ఉన్న OHE వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలును లోకో పైలట్ అప్రమత్తమై నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులతో సహా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
తన తల్లి ప్రాణాలను నిలిపిన ఘనత భారతదేశానికే దక్కుతుందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ తెలిపారు. హసీనాపై హత్యాయత్నాన్ని భారత్ నిరోధించిందని వ్యాఖ్యానించారు. స్వదేశంలో తన తల్లికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉందని, సంక్షోభ సమయంలో ఆమె ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని సాజిబ్ వాజేద్ తెలిపారు.
పశ్చిమాసియా పవర్ బ్యాలెన్స్లో కీలక మార్పు రాబోతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను పొందిన ఏకైక దేశం ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాకు కూడా ఈ జెట్లను అమ్మడానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది.
మన సనాతన హైందవ ధర్మం శక్తిని.. పరాక్రమాన్ని ‘అఖండ 2 తాండవం’లో చూస్తారని అన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ, సంయుక్తా మేనన్ జంటగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. తాజాగా మేకర్స్ ‘జాజికాయ జాజికాయ’ అనే పాటను వైజాగ్లో విడుదల చేశారు.
ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది.. మహిళల 54 కేజీల సెమీఫైనల్లో ప్రీతి 4-0తో ప్రపంచ ఛాంపియన్ హంగ్ హిసావోని కంగుతినిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హుడా కూడా ఫైనల్ చేరింది.