ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో RK పాలన కొనసాగుతుందని విమర్శించారు. RK అంటే రేవంత్, కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడుతానన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏం చేశారన్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దు అని కాంగ్రెస్ కోరుకుందన్నారు. ఇప్పుడు బాల్ ప్రభుత్వం వద్దే ఉందన్నారు బండి సంజయ్.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ.. హాట్ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ పోస్ట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన కేటీఆర్పై.. అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టతున్నారంటూ ట్వీట్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో.. రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలంటూ పోస్ట్ చేశారు. ట్వీట్లో KTRకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ట్వీట్లో పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణిలో భారీ చోరీ బయటపడింది. కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రికల్ మెటీరియల్, కేబుల్స్, మోటార్ల చోరీ వెలుగులోకి వచ్చింది. జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 50కి పైగా దొంగతనాలు జరిగాయి. తాజాగా సీసీ ఫుటేజ్ బయటపడటంతో ఈ సంచలన విషయాలు తెలిశాయి. సింగరేణి అధికారులు తొలుత గోప్యత పాటించారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ వరుసగా చోరీలు జరుగుతుండటంతో కొంతమంది అధికారుల సహాయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. చోరీలపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు సింగరేణి కార్మికులు
ఐబొమ్మ ఇమ్మంది రవిని కస్టడీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవ్వాళ్టి నుండి 5 రోజులు పాటు సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. అరెస్ట్ టైంలో హార్డ్ డిస్క్లు, సామగ్రిని స్వాధీనం కూడా చేసుకున్నారు. విదేశాల నుండి ఐ బొమ్మ నడిపిన తీరుపై కూడా విచారణ చేయనున్నారు. రవి ఎన్ని కోట్లు సంపాదించాడో..అతని వెనుకున్న వ్యక్తులు ఎవరో విచారణలో తేలే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.-ఫార్మాలా e రేస్ కేసులో కేటీఆర్ విచారణ కక్ష సాధింపు చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.విచాణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజ్యంగ బద్ధమైన విషయమన్నారు. పసలేని వాదనలతో బీఆర్ఎస్ తప్పించుకోవాలని చూస్తోందని.. తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోండని హితవు పలికారు ఎమ్మెల్సీ.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో కుమార్తె వివాహం చేయలేక తండ్రి చీట్టి వీరయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద కుమార్తె పెళ్లి కోసం పొలం అమ్మిన వీరయ్య, ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ పూర్తి చేసిన రెండో కుమార్తె సంధ్యకు వివాహం చేయలేకపోతున్నానని తీవ్రంగా బాధపడేవారు. దీనికితోడు ఆస్తమాతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరయ్య గ్రామ శివారులో సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి భార్య అనూషవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బీజేపీ, కాంగ్రెస్పై హాట్ కామెంట్స్ చేశారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల లీడర్లపై కేసుల పేరుతో వేధిస్తున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడంతో విఫలమవుతున్నారన్నారు. దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. అందుకు తానే ఉదాహరణ అన్నారు.
వారణాసి టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి చేసిన కామెంట్లపైనా బండి సంజయ్ స్పందించారు. ఎవరి ఆలోచన వాళ్లదని.. భవిష్యత్ లో రాజమౌళి దేవుడిని నమ్మేలా దేవుడి కరుణాకటాక్షలు ఆయనపై ఉండాలన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో సక్సెస్ కావాలన్నారు.
విజయవాడలోని పటమట రైతు బజార్ను కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకం, పరిసరాల పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. పాలిథీన్ కవర్లు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయనగరం జిల్లా బొద్దాంలో కొండచిలువ హల్చల్ చేసింది. సింహాచలం అనే రైతు తోటలో సుమారు 12 అడుగుల గల కొండచిలువ సంచరించడంతో అటుగా వెళుతున్న రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ అధికారుల ఆదేశాలతో స్నేక్ స్నాచర్ శేఖర్ అప్రమత్తంగా పామును బంధించి మైదాన ప్రాంతంలో విడిచిపెట్టారు.
రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశించలేమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గవర్నర్కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలమని జస్టిస్ బీఆర్ గవాయ్ తేల్చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందక మల్లయ్య మృతి చెందారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సకాలంలో స్పందించకపోవడం వల్లే చనిపోయాడని వారు ఆరోపించారు.
జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల లీకేజీలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు లీకేజీ ఏర్పడడంతో నిల్వ ఉన్న నీరు వృథాగా దిగువకు పోతోంది. ఇప్పటికే పూడిక పేరుకుపోవడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో లీకేజీల ద్వారా నీరు వృథాగా పోతుండటం ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది.
బీహార్లో NDA ప్రభుత్వం కొలువుదీరింది. నితీశ్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఆయనచే ప్రమాణం చేయించారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా NDA పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు.
నితీష్ ప్రమాణస్వీకారం
దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దీనిలో భాగంగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2008లో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్పుర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్-ఫలా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అని దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఏబీసీ న్యూస్ విలేకరి మేరీ బ్రూస్పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు ట్రంప్. సంస్థ లైసెన్సును రద్దు చేస్తానని హెచ్చరించారు.
దక్షిణాఫ్రికాతో నవంబర్ 30న మొదలయ్యే వన్డే సిరీస్కు సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా హార్దిక్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్పై దృష్టి సారించి, మొదట సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. పనిభారం కారణంగా బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్పేట్ సెంటర్లో తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు దర్శకుడు సాయిలు కంపాటి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అగ్ర హీరోలు అనవసర ఖర్చులు కూడా నిర్మాతలతో పెట్టిస్తున్నారని బాలీవుడ్లో ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సెట్స్కు ఫుడ్ ట్రక్కు తెచ్చుకుంటారని కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై కొరియోగ్రాఫర్లు పీయూష్ భగత్, షాజియా సమ్జీ క్లారిటీ ఇచ్చారు. అగ్ర హీరోలు వారి ఖర్చులను వారే భరిస్తారని నిర్మాతలకు సంబంధం లేదని చెప్పారు.