ఆధునిక కాలంలో కిడ్నీల సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు చేరడం అనేది ఎక్కువ మందిలో చూస్తున్నాము. అయితే ఆహారపరంగా, వ్యాయామపరంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు చేరకుండా కాపాడుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు మన ఆరోగ్యానికి మంచివే. కానీ వాటిని అతిగా తింటే మాత్రం కిడ్నీలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆరోగ్యకరమైన ఆహారాలను మరి అతిగా తినకుండా మితంగా తినాల్సిన అవసరం ఉంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకోండి.
పాలకూర
పాలకూరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినమని వైద్యులు కూడా సూచిస్తారు. అయితే ఇది ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ప్రమాదం. దీనిలో ఆక్సిలైట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆక్సలైట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణంగా మారుతాయి. కాబట్టి పాలకూరను ఎక్కువగా తీసుకోకూడదు. అది మూత్రపిండాలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పటికే కిడ్నీలో రాళ్లతో సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
దుంపలు
బంగాళదుంపలు, బీట్రూట్లు, క్యారెట్లు వంటి దుంప జాతుల్లో కూడా ఆక్సలైట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని కూడా అధికంగా తీసుకోకూడదు. అవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచేస్తాయి. ఈ దుంపల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరం మొత్తానికి ఇది ఆరోగ్యాన్ని అందిస్తాయి. కానీ మరీ అధికంగా తింటే మాత్రం మూత్రపిండాలకు హానికరంగా మారుతాయి. కిడ్నీలో రాళ్లకు కారణం అవుతాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ రోజుకో చిన్న ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. అలాగని ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో డార్క్ చాక్లెట్ ను తింటూ ఉన్నా లేదా ఇతర చాక్లెట్లను కూడా అధికంగా తింటూ ఉన్న అవి కిడ్నీలో రాళ్లకు కారణం అవుతాయి. వాటిలో కూడా అధిక మొత్తంలో ఆక్సలైట్లు ఉంటాయి. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరిగిపోతుంది. ఇప్పటికే కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్న వారు చాక్లెట్లను దూరంగా పెట్టాలి.
నట్స్
బాదంపప్పు, పిస్తా పప్పులు, వాల్నట్స్ వంటివి మన గుండెకు, మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. వాటిని రోజుకు గుప్పెడు తింటే చాలు ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగని అధికంగా తినడం మొదలుపెడితే మాత్రం కిడ్నీలో రాళ్లు ఏర్పడడం మొదలవుతాయి. వీటిలో కూడా ఆక్సలేట్లు ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరిగిపోతుంది. మీకు కూడా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఈ నట్స్ తీసుకోవడం తగ్గించండి. రోజుకు గుప్పెడు కన్నా తినకపోవడమే మంచిది.
సోయా ఉత్పత్తులు
సోయా ఉత్పత్తులు కూడా మార్కెట్లో అధికంగానే దొరుకుతున్నాయి. సోయా మిల్క్, సోయాబీన్స్, సోయా టోఫు వంటివి అధికంగా లభిస్తాయి. వీటిలో ఫైటేట్స్, ఆక్సిలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్ల నిర్మాణానికి దోహదం చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆహారాలన్నీ అతి తక్కువగా తీసుకోవాలి. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
Also Read: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా? ప్రతిరోజు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తినిపించండి