CM Revanth Reddy: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు అద్దేందుకు.. ఆసుపత్రిని మరో వందేళ్లు ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటల 40 నిమిషాలకు శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజలో భట్టి, దామోదర, కేకే పలువురు పాల్గొన్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నారు. 26.30 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పోరేట్ ఆస్పత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు.
వచ్చే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో.. నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశారు. పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని.. అవసరమైనచోట ఇతర మార్గాలను కలిపేలా అండర్పాస్లు నిర్మించాలని సూచించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకుల వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్గ్రౌండ్లోని రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలని సూచించారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు నిర్మించాలని ఆదేశించారు. విదేశాల్లో స్థిరపడ్డవారు స్వదేశానికి వచ్చేందుకు 2, 3 రోజులు పడుతున్న నేపథ్యంలో.. ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని… ఆసుపత్రికి వచ్చామనే భావన రోగులకు కలగకుండా ఉండేలా సర్వ హంగులతో నిర్మించాలని సీఎం సూచించారు.
Also Read: కేరళ లిక్కర్ స్కామ్లో కవిత.. మళ్ళీ జైలుకే..?
ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్, కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లకు సరిపడా OP కౌంటర్ల నిర్మాణం చేయాలని ఆదేశించారు. నయా ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి.