Dehydration Symptoms: తీవ్రమైన ఎండల కారణంగా వేసవిలో చాలామంది మూత్రం రంగు మారడం, గాఢమైన వాసన రావడం లేదా మంట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. సాధారణంగా దీనిని డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) అనుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
వేసవిలో విపరీతంగా చెమట పట్టడం వల్ల మన శరీరం నీటిని, అవసరమైన ఖనిజాలను వేగంగా కోల్పోతుంది. మనం తాగే నీటి పరిమాణం కంటే కోల్పోయే నీరు ఎక్కువైనప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమయంలో కిడ్నీలు శరీరంలోని నీటిని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల మూత్రం బాగా చిక్కబడి, ముదురు రంగులోకి మారి తీవ్రమైన వాసన వస్తుంది.
Also Read: బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!
మన మూత్రంలో యూరోక్రోమ్ అనే సహజ వర్ణద్రవ్యం ఉంటుంది. మనం సరిపడా నీరు తాగినప్పుడు మూత్రం పలచగా మారి లేత పసుపు రంగులో లేదా తేటగా కనిపిస్తుంది. అదే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఈ పిగ్మెంట్ గాఢత పెరిగి, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అయితే, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్లు వాడేవారిలో కూడా మూత్రం ఇలా మారడం సహజం. దీని గురించి కంగారుపడాల్సిన పనిలేదు.
సరిపడా నీరు తాగుతున్నప్పటికీ మూత్రం రంగు మారకపోవడం, దాంతో పాటు విపరీతమైన మంట, నొప్పి వంటివి ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా లివర్, కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి స్థితిలో వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
వేసవిలో మూత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేసే వరకు ఆగకుండా రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలి. కేవలం మంచినీళ్లే కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అంది శరీరం రీహైడ్రేట్ అవుతుంది.
Also Read: ఈ పిచ్చి ఎండలకు వడదెబ్బ తగలకూడదంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తాగాల్సిందే!