Cancer In Fish| చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అయితే చేపల గురించి తాజాగా ఒక ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు మంచినీటిలో జీవించే బ్రౌన్ బుల్హెడ్ క్యాట్ఫిష్లో ఒక అరుదైన క్యాన్సర్ రకం గుర్తించారు. ఈ క్యాన్సర్ సాధారణ క్యాన్సర్లా ఒకే జీవిలో ఉండకుండా, ఒక చేప నుంచి మరో చేపకు వ్యాపించే లక్షణం కలిగి ఉంది. ఈ పరిశోధన ప్రముఖ నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధన అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రం, కెనడాలోని క్యూబెక్ ప్రాంతాల మధ్య ఉన్న లేక్ మెమ్ఫ్రెమాగాగ్లో నివసించే చేపలపై జరిగింది.
సాధారణంగా క్యాన్సర్ ఆరోగ్యకరమైన కణాలు నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ప్రారంభమవుతుంది. ఆ కణాలు అదే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. అయితే అవి మరో జీవి శరీరంలోకి వెళ్లి పెరగవు.
కానీ ఈ కొత్త రకమైన క్యాన్సర్లో జీవించి ఉన్న క్యాన్సర్ కణాలు ఒక చేప నుంచి మరో చేపలోకి చేరి అక్కడ కూడా పెరుగుతున్నాయి. అందుకే దీన్ని ట్రాన్స్మిసిబుల్ క్యాన్సర్ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. చేపల్లో ఇలాంటి క్యాన్సర్ను గుర్తించడం ఇదే తొలిసారి. అలాగే మంచినీటి జీవవ్యవస్థలో కూడా ఇదే మొదటి నమోదు అయిన ఘటన.
పరిశోధకులు క్యాన్సర్ ఉన్న చేపల ట్యూమర్లు, ఆరోగ్యకరమైన కణజాలాన్ని పరీక్షించారు. వాటి జన్యు నిర్మాణాన్ని పోల్చి చూశారు.
వివిధ చేపల నుంచి సేకరించిన ట్యూమర్లలో దాదాపు ఒకే రకమైన జన్యు లక్షణాలు కనిపించాయి. అయితే అదే చేపల ఆరోగ్యకరమైన కణజాలంలో ఆ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఈ ట్యూమర్లు ఒక్కో చేపలో విడిగా ఏర్పడలేదని, ఒకే క్యాన్సర్ కణాల వంశం నుంచి వచ్చినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఈ క్యాన్సర్ ఒక చేప నుంచి మరో చేపకు ఎలా చేరుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు కొన్ని అవకాశాలను సూచించారు. సంతానోత్పత్తి సీజన్లో అనేక చేపలు ఒకే ప్రాంతంలో చేరి దగ్గరగా సంచరిస్తాయి. ఆ సమయంలో క్యాన్సర్ కణాలు ఒక చేప నుంచి మరో చేపకు చేరే అవకాశం ఉంది.
మరో అవకాశం నీటి ద్వారా వ్యాప్తి చెందడం. చేపల చర్మం, నోరు, గిల్లులు ఎప్పుడూ నీటితో సంబంధం కలిగి ఉంటాయి. నీటిలో క్యాన్సర్ కణాలు ఉంటే అవి ఈ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు.
బ్రౌన్ బుల్హెడ్ క్యాట్ఫిష్ ఎక్కువగా మంచినీటిలో అంటే సరస్సు అడుగు భాగంలో జీవిస్తుంది. వీటికి రక్షణగా ఉండే గట్టి పొలుసులు కూడా ఉండవు. అందువల్ల సరస్సు అడుగున కొంతసేపు జీవించే క్యాన్సర్ కణాలతో ఇవి సంపర్కంలోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా కచ్చితమైన ఆధారాలు లేవు.
ప్రకృతిలో ట్రాన్స్మిసిబుల్ క్యాన్సర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇంతకుముందు కుక్కలు, టాస్మానియన్ డెవిల్స్(నక్కలో ఒక జాతి) కొన్ని షెల్ఫిష్ జాతుల్లో మాత్రమే ఇలాంటి క్యాన్సర్ నమోదైంది. ఇప్పుడు చేపల్లో కూడా ఈ క్యాన్సర్ కనిపించిందని శాస్త్రవేత్తలలు తెలిపారు.
Also Read: శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే
ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఈ క్యాన్సర్ మనుషులకు వ్యాపించే ప్రమాదం లేదు. ఈ పరిశోధన బ్రౌన్ బుల్హెడ్ క్యాట్ఫిష్పైనే జరిగింది.
మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చిన కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. అందుకే అవయవ మార్పిడి చేసిన రోగులకు రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు ఇస్తారు. అందువల్ల ఈ చేపల క్యాన్సర్ మనుషులకు ప్రమాదం కలిగిస్తుందని ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు.
ఈ అరుదైన క్యాన్సర్ శాస్త్రవేత్తలకు క్యాన్సర్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకునే కొత్త అవకాశాన్ని అందించింది. ఈ కణాలు ఒక జీవి నుంచి మరో జీవిలో ఎలా జీవిస్తాయో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. భవిష్యత్తులో ఈ అధ్యయనం క్యాన్సర్ వ్యాప్తి, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులపై మరింత అవగాహన కల్పించే అవకాశం ఉంది.