FSSAI Warns India: పన్నీర్ తినడం మానేయమని ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)భారతదేశ ప్రజలను హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పూర్తిగా తప్పు అని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ అలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని, ప్రజలు భయ పడాల్సిన అవసరం లేదని తెలియజేసింది. పన్నీర్ స్వచ్ఛతను నిర్ధారించడానికి ఇంట్లో ఐయోడిన్ టింక్చర్ పరీక్ష చేయమని ఇంటర్నెట్లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందిస్తూ.. ఆ పరీక్ష సరైన పద్ధతి కాదని, తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
అసలు విషయం ఏమిటి ?
కొంతకాలం క్రితం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ దేశవ్యాప్తంగా పన్నీర్ నాణ్యతను చెక్ చేయడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్లో భాగంగా.. ఇండియా అంతటా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి 122 పన్నీర్ నమూనాలను సేకరించి, వాటిని అధికారిక ల్యాబ్లకు పంపించారు. ఈ పరీక్షల ప్రధాన లక్ష్యం, పన్నీర్ లో కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడం. ముఖ్యంగా, పన్నీర్ లో స్టార్చ్ (పిండి పదార్థం) కలిపారా అనేది ఈ పరీక్షల ద్వారా నిర్ధారించాలనుకున్నారు. కొన్ని కల్తీ పన్నీర్లలో, బంగాళదుంపల నుంచి తీసిన పిండి పదార్థం లేదా ఇతర రకాల దీనివల్ల పన్నీర్ బరువు పెరిగి, ధర తగ్గుతుంది.
పరీక్ష ఫలితాలు ఏమిటి ?
ఈ 122 నమూనాలను పరీక్షించిన తరువాత, వాటిలో అనేక నమూనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ముఖ్యంగా.. వీటిలో చాలా వాటిలో పిండి పదార్థం (స్టార్చ్) కల్తీ జరిగినట్లు స్పష్టమైంది. ఈ ఫలితాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నప్పటికీ, FSSAI ప్రజలు పన్నీర్ తినడం పూర్తిగా మానేయమని ఎక్కడా చెప్పలేదు. బదులుగా.. కల్తీ పన్నీర్ను గుర్తించడానికి , అటువంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మాత్రమే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించింది.
ఐయోడిన్ టింక్చర్ పరీక్ష: ఎంతవరకు నమ్మాలి?
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఐయోడిన్ టింక్చర్ పరీక్ష పద్ధతి ప్రకారం.. పన్నీర్పై ఐయోడిన్ ద్రావణాన్ని వేస్తే, అది నీలం రంగులోకి మారితే అందులో పిండి పదార్థం ఉందని అర్థం. ఈ పద్ధతి కొంతవరకు పనిచేసినప్పటికీ, ఇది పూర్తి ఖచ్చితమైనది కాదు. FSSAI ప్రకారం.. ప్రొఫెషనల్ ల్యాబ్లలో ఉపయోగించే పరీక్షలు మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. అంతే కాకుండా, పిండి పదార్థం మాత్రమే కాకుండా, ఇంకా చాలా రకాల కల్తీలు పన్నీర్లో జరగవచ్చు. వాటిని ఈ పరీక్ష ద్వారా గుర్తించడం సాధ్యం కాదు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పన్నీర్ తినడం మానేయాల్సిన అవసరం లేదని, అయితే, తెలిసిన, నమ్మకమైన బ్రాండ్లు లేదా దుకాణాల నుంచి మాత్రమే పన్నీర్ను కొనుగోలు చేయాలని సలహా ఇచ్చింది. కల్తీ పన్నీర్ను మార్కెట్ నుంచి తొలగించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజలు భయ పడకుండా ఉండాలని స్పష్టం చేసింది.