First Christmas Cake: క్రిస్మస్.. పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది కేక్ మాత్రమే. అయితే ఈ కేక్ మన సంప్రదాయ వంటకం కాదు. అది బ్రిటిష్ సంస్కృతి నుంచి మన దేశానికి వచ్చింది. ఈ క్రమంలో ఇండియాలో తొలి క్రిస్మస్ కేక్ ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే.. అప్పట్లో కేక్ తయారీకి అవసరమైన పదార్థాలు కూడా అంత ఈజీగా దొరకని పరిస్థితి. అయినా బ్రిటీష్ వాళ్లు మెచ్చేలా ఒక భారతీయుడు కేక్ను తయారు చేశాడు. ఆ వ్యక్తి స్థాపించిన బేకరీనే ఈరోజు ఫ్లమ్ కేక్ తయారీలో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
1883 క్రిస్మస్ రోజున భారతదేశంలో తొలి క్రిస్మస్ కేక్ను తయారు చేసిన వ్యక్తి కేరళ తలస్సేరికి చెందిన మాంబల్లి బాపు. బర్మాలో వ్యాపారం చేస్తున్న సమయంలోనే అతనికి బిస్కెట్ తయారీలో శిక్షణ లభించింది. తర్వాత 1880లో స్వగ్రామానికి తిరిగి వచ్చిన బాపు, తలస్సేరిలో ఒక చిన్న బేకరీని ప్రారంభించాడు. అప్పట్లో కోల్కతాలో ఉన్న ఒక్క బేకరీ మాత్రమే బ్రిటీష్ వారి అవసరాలను తీర్చేది. ఆ లోటును బాపు స్థాపించిన ‘రాయల్ బిస్కట్స్ ఫ్యాక్టరీ’ పూరించింది. ఈ విధంగా భారతీయుల చేతులమీదుగా ప్రారంభమైన తొలి బేకరీగా అది గుర్తింపు పొందింది.
Also Read: క్రిస్మస్ స్పెషల్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే 5 రకాల టేస్టీ కేకులివే!
అదే సమయంలో తలస్సేరి సమీపంలో దాల్చిన చెక్క తోటను అభివృద్ధి చేస్తున్న బ్రిటిష్ వ్యవసాయ అధికారి మర్డోక్ బ్రౌన్ ఒక రోజు ఇంగ్లండ్ నుంచి తెచ్చిన రిచ్ ప్లం కేక్ను బాపుకు రుచి చూపించాడు. ‘ఇదే రుచితో ఇక్కడ తయారు చేయగలవా?’ అని అడిగాడు. బాపు ఆ సవాలును స్వీకరించాడు. కేక్ తయారీకి అవసరమైన బ్రౌన్ కోకో, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలను మర్డోక్ అందించాడు. అలాగే పుదుచ్చేరి నుంచి బ్రాందీని తెప్పించి ఉపయోగించమన్నాడు.
ఆ కాలంలో ఈస్ట్ అందుబాటులో లేకపోవడంతో కిణ్వన ప్రక్రియ పెద్ద సమస్యగా మారింది. దూరప్రాంతాల నుంచి బ్రాందీ తెప్పించాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పని. దాంతో బాపు స్థానికంగా దొరికే జీడిపప్పు, యాపిల్, కడలిపాజమ్(అరటి రకం) వంటి పదార్థాలతో తయారైన దేశీయ మద్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించాడు. ఆ ప్రయోగమే ప్రత్యేక రుచికి కారణమైంది.
అలా బాపు తయారు చేసిన కేక్ను రుచి చూసిన మర్డోక్ బ్రౌన్ ఎంతో ఆనందపడి ‘ఇది అద్భుతం’ అంటూ డజన్ల కొద్దీ కేకులను కొనుగోలు చేశాడు. అలా బాపు పేరు భారతీయ వంటకాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఈరోజు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తలస్సేరి మాంబల్లి బేకరీ దేశంలోనే అతిపెద్ద ప్లంకేక్ మార్కెట్ను కలిగి ఉంది.
మాంబల్లి బాపు వారసులు ఇప్పటికీ కేరళలో అనేక ప్రముఖ బేకరీలను నిర్వహిస్తున్నారు. కొచ్చిలోని కోచిన్ బేకరీ, తిరువనంతపురంలోని శాంత బేకరీ, కోజికోడ్లోని మోడర్న్ బేకరీ, కొట్టాయంలోని బెస్ట్ బేకింగ్ కో.. తలస్సేరిలోని మాంబల్లి బేకరీ.. ఇవన్నీ బాపు ప్రారంభించిన వారసత్వానికి ప్రతీకలు. ప్రతి బేకరీలో బాపు కేక్ను తయారు చేస్తున్న చిత్రాలు దర్శనమిస్తూ, కస్టమర్లకు ఒక చారిత్రక కథను గుర్తుచేస్తుంటాయి.
Also Read: ప్రియమైన వారికి క్రిస్మస్ విషెస్ చెప్పాలా? బైబిల్ కోట్స్తో ప్రత్యేక సందేశాలు మీ కోసం!