Leftover wheat dough safety: ఇంట్లో చపాతీలు చేసుకునేటప్పుడు పిండి కలపడం సర్వసాధారణం.అయితే.. ఒక్కోసారి కలిపిన పిండి మిగిలిపోతుంటుంది. ఆ పిండిని ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు రోటీలు చేసుకోవడం చాలా మంది చేస్తుంటారు. కానీ, ఇలా మిగిలిపోయిన గోధుమ పిండిని వాడటం ఆరోగ్యానికి నిజంగా సురక్షితమేనా? పాచిపోయిన పిండితో చేసిన రోటీలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అసలు పిండి ఎన్ని రోజులకు పూర్తిగా పాడవుతుంది ? అనే సందేహాలకు జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో వంట చేసే సమయంలో కొలతలు తప్పుడమో లేదా చపాతీలు సరిపోవని పిండి ఎక్కువ కలపడమో జరుగుతుంటుంది. అలా మిగిలిపోయిన పిండిని పడేయకుండా చాలా మంది ఫ్రిజ్లో పెడతారు. పైన చూడటానికి ఆ పిండి బాగానే ఉన్నట్లు అనిపించినా, మైక్రోస్కోపిక్ స్థాయిలో అక్కడ చాలా మార్పులు జరుగుతుంటాయి. మరి ఇలాంటి పిండితో చేసిన రోటీలు మనం తినవచ్చా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గోధుమ పిండిలో నీరు కలిపిన క్షణం నుంచే దానిలో రసాయన, జీవసంబంధమైన మార్పులు ప్రారంభమవుతాయి. గది ఉష్ణోగ్రత వద్ద అయితే గంటల వ్యవధిలోనే.. బాక్టీరియా, ఈస్ట్ వేగంగా పెరుగుతాయి. ఫ్రిజ్లో పెట్టినప్పటికీ.. కొన్ని రకాల హానికరమైన సూక్ష్మజీవులు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి పిండితో రోటీలు చేసి తింటే కడుపు నొప్పి, వాంతులు లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.
మీరు కలిపి పెట్టిన పిండి రంగు కొద్దిగా నల్లగా మారడం లేదా బూడిద రంగులోకి మారడం గమనించారా? అలాగే దాని నుంచి పుల్లని వాసన రావడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీ పిండికి అలాంటి వాసన వస్తే, అది పూర్తిగా పాచిపోయినట్లే . ఆ పిండిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. పాచిపోయిన పిండితో చేసిన రోటీలు తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
నిపుణుల ప్రకారం.. మీరు పిండిని కలిపిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో పెట్టి వెంటనే ఫ్రిజ్లో పెడితే కొన్ని గంటల పాటు (గరిష్టంగా 12 నుంచి 24 గంటలు) మాత్రమే అది సురక్షితంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం.. అంటే ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచిన పిండిని వాడటం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా వేసవి కాలంలో పిండి చాలా త్వరగా పాడైపోతుంది.
ఎప్పుడూ అప్పటికప్పుడు తాజా పిండితో .. చేసుకున్న చపాతీలే ఆరోగ్యానికి ఎంతో మంచివి. పిండి కలిపేటప్పుడు కావలసిన పరిమాణంలో కలుపుకోవడం బెస్ట్. ఒకవేళ పిండి మిగిలిపోయినా, దాని రంగు, వాసన చెక్ చేసిన మాత్రమే వాడాలి. కొద్దిగా తేడా ఉన్నా నిర్మొహమాటంగా ఆ పిండిని పారవేయడమే మంచిది. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మిగిలిన పిండితో వంటకాలు చేయడం మంచిది కాదు.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అంటారు. కేవలం పిండి వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో పాచిపోయిన పిండితో రోటీలు చేసి కుటుంబ సభ్యులకు పెడితే అది అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి.. జాగ్రత్తలు పాటించి సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవడం ఎప్పుడూ మంచిది.