Survival Thriller on OTT: ఒక ఆసుపత్రిలో వందలాది మంది రోగులు… వారిలో గర్భిణీలు, పసిపిల్లలు కూడా ఉన్నారు. బయట ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు… లోపల మాత్రం ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కొంతమంది నర్సులపై ఉంది. చేతిలో ఆయుధం లేదు… తప్పించుకునే మార్గం లేదు, ఏ క్షణంలో ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక నర్సు తన ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మందిని కాపాడేందుకు పోరాడితే ? దేశం మొత్తం వణికిపోయిన 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో కామా హాస్పిటల్లో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన పవర్ఫుల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata 2026). భయం చుట్టుముట్టిన ఆ ఒక్క రాత్రిలో సామాన్య నర్సులు చూపించిన అసాధారణ ధైర్యాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
2008 నవంబర్ 26… ముంబై నగరం ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడులతో ఉలిక్కిపడుతుంది. నగరంలోని పలుచోట్ల కాల్పులు, పేలుళ్లు జరుగుతుంటాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటారు. ఈ భయానక పరిస్థితుల మధ్య కామా హాస్పిటల్లో మాత్రం ఎప్పటిలాగే వైద్య సిబ్బంది తమ విధుల్లో ఉంటారు. గర్భిణీలు, నవజాత శిశువులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులతో ఆసుపత్రి నిండిపోయి ఉంటుంది.
కానీ బయట జరుగుతున్న దాడి చివరకు ఆసుపత్రి తలుపుల వరకు చేరుతుంది. ఉగ్రవాదులు ఆసుపత్రి పరిసరాల్లోకి చొరబడటంతో అక్కడున్న ప్రతి ఒక్కరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో ఆసుపత్రిలో భయాందోళనలు మొదలవుతాయి. ఎటు వెళ్లాలో తెలియని రోగులు, ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ఉన్న గర్భిణీలు… అందరి చూపు ఇప్పుడు వైద్య సిబ్బందిపైనే ఉంటుంది.
ఆ సమయంలో హెడ్ నర్స్గా పని చేస్తున్న గీతా మాధవ్ గంధారే పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవడం సులభమైన మార్గమే. కానీ తన కళ్ల ముందున్న వందలాది మంది రోగులను వదిలి వెళ్లడం మాత్రం ఆమెకు సాధ్యం కాదు. గీతతో పాటు షీతల్, తృప్తి వంటి నర్సులు కూడా అక్కడే ఉండి రోగులను కాపాడాలని నిర్ణయించుకుంటారు.
ముందుగా ఆసుపత్రిలోని లైట్లన్నింటినీ ఆర్పేస్తారు. ఉగ్రవాదులకు తమ ఆచూకీ తెలియకుండా వార్డులను చీకట్లో ఉంచుతారు. తలుపులను బలంగా మూసి, భారీ ఇనుప బీరువాలు, బెడ్లను అడ్డుగా పెట్టి లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. బయట నుంచి ఎప్పుడు తూటా దూసుకొస్తుందో తెలియదు… అయినా నర్సులు మాత్రం భయపడుతున్న రోగులకు ధైర్యం చెబుతూనే ఉంటారు.
అసలు పరీక్ష మాత్రం ఆ తర్వాత మొదలవుతుంది. ఆసుపత్రిలో ప్రసవ వేదన పడుతున్న గర్భిణీలు ఉంటారు. బయట ఉగ్రవాదులు తిరుగుతున్న సమయంలో వారి అరుపులు వినిపిస్తే ఆసుపత్రిలో ఎవరు దాక్కున్నారో వారికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. దీంతో నర్సులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చీకట్లోనే ప్రసవాలు చేయించాల్సి వస్తుంది. ఒకవైపు తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడాలి. మరోవైపు చిన్న శబ్దం కూడా బయట ఉన్న ఉగ్రవాదులకు తమ ఉనికిని తెలియజేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నర్సులు తమ భయాన్ని పక్కన పెట్టి వైద్య సేవలు కొనసాగిస్తారు. ఒక్కో రోగిని సురక్షితమైన ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో తెలియకపోయినా తమ కర్తవ్యాన్ని మాత్రం వదులుకోరు.
గంటలు గడిచేకొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. బయట కాల్పులు, పేలుళ్ల శబ్దాలు… లోపల ప్రాణభయంతో ఉన్న వందలాది మంది. తమ కళ్ల ముందే ప్రమాదం ఉన్నా రోగులకు మాత్రం ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నర్సులపైనే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది వైద్య సిబ్బంది కూడా ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడే సినిమా అసలు భావోద్వేగం బయటపడుతుంది. యుద్ధం చేయడానికి ఆయుధాలు అవసరం లేదు… ప్రాణాలను కాపాడాలనే సంకల్పం కూడా ఒక రకమైన పోరాటమే అని ఈ కథ చెబుతుంది. తుపాకులు పట్టుకున్న ఉగ్రవాదులకు ఎదురుగా నిలబడినవారు సైనికులు కాదు… సాధారణ నర్సులు. తమ ముందున్న ప్రతి రోగిని తమ కుటుంబ సభ్యుడిలా భావించి, ఒక్కో ప్రాణాన్ని కాపాడేందుకు వారు చేసే ప్రయత్నం కథను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుంది.
చివరకు రక్షణ దళాలు, పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ భయంకరమైన రాత్రికి ముగింపు పలుకుతుంది. వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు నర్సులు చేసిన పోరాటం ఎలా సాగింది ? అన్నది కథ. ఆ రాత్రి ఎదుర్కొన్న భయం, కోల్పోయిన ప్రాణాలు, తమ కళ్ల ముందే జరిగిన విషాదం మాత్రం వారి జీవితాల్లో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ కథకు 26/11 దాడుల సమయంలో కామా హాస్పిటల్లో పనిచేసిన నిజ జీవిత నర్సు అంజలి కుల్తే సాహసం ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. ఆ భయంకరమైన రాత్రిలో గర్భిణీ స్త్రీలను కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఈ కథకు బలమైన ఆధారంగా మారాయి. అందుకే ఈ సినిమా కేవలం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ కాదు.. ప్రమాదం ఎదురైనప్పుడు సామాన్య మనుషుల్లో దాగి ఉన్న అసాధారణ ధైర్యాన్ని చూపించే కథ.
గీతా మాధవ్ గంధారే పాత్రలో కంగనా రనౌత్ నటించగా, గిరిజా ఓక్, స్మితా తాంబే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు పరిమిత బడ్జెట్లోనే బిగువైన స్క్రీన్ప్లే రూపొందించడం మరో ప్రత్యేకత. ముఖ్యంగా ఒకే రాత్రిలో జరిగే సంఘటనలను కేంద్రీకరించడం వల్ల కథలో టెన్షన్ మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతుంది. ఒకవైపు ఉగ్రవాదుల తుపాకులు… మరోవైపు ఆయుధాలు లేని నర్సుల ధైర్యం. 26/11 దాడుల సమయంలో కామా హాస్పిటల్లో నిజంగా ఏం జరిగింది ? ప్రాణభయాన్ని పక్కనపెట్టి నర్సులు వందలాది మంది రోగులను ఎలా కాపాడారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకునేవారు ‘భారత్ భాగ్య విధాత’ను చూడొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను చూడవచ్చు.
Read ALso: ఫ్యామిలీ అంతా ఫేక్… అందమైన కుటుంబం వెనుక ఇంత పెద్ద మోసమా ?