అన్నం మిగిలిపోతే బయట పడేసే కన్నా దానితో టేస్టీగా పల్లీల రైస్ చేసి చూడండి. దీని లంచ్ బాక్స్ రెసిపీగా, బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా కూడా వాడుకోవచ్చు. పైగా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దాదాపు అన్ని ఇళ్లల్లో అన్నం మిగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మిగిలిపోయిన అన్నాన్ని చలికాలంలో తినేందుకు ఎవరూ ఇష్టపడరు. అలాంటి సమయంలోనే పల్లీల రైస్ చేయడానికి ప్రయత్నించండి. వేరుశనగ పలుకులతో చేసే ఈ రైస్ అదిరిపోయేలా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
పల్లీల రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగ పలుకులు – పావు కప్పు
కరివేపాకులు – గుప్పెడు
శెనగపప్పు – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
నూనె – తగినంత
ఆవాలు – అర స్పూను
వండిన అన్నం – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
ఎండుమిర్చి – నాలుగు
నువ్వులు – పావు కప్పు
పల్లీల రైస్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులను వేసి ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి.
2. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3. ఇవన్నీ వేగాక చివరిలో నువ్వులను వేయాలి.
4. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీల పొడి రెడీ అయినట్టే.
5. ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయిని పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, కరివేపాకులు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
7. మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేయాలి.
8. రుచికి సరిపడా ఉప్పును జల్లుకొని ముందుగా పొడిచేసి పెట్టుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని వేసి పులిహోర లాగా కలుపుకోవాలి.
9. అంతే టేస్టీ పల్లీల రైస్ తయారైపోతుంది.
10. దీన్ని వండుతున్నప్పుడే తినేయాలనిపిస్తుంది. పిల్లలకు ఒక స్పూను నెయ్యిని కలిపి ఇవ్వండి. వారు ఇష్టంగా తింటారు.
పల్లీలు లేదా వేరుశనగ పలుకులు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగల్లో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మానసిక సమస్యల బారిన పడడం తగ్గుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు పల్లీల రైస్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని ప్రతి పూటా తినడం మంచిది కాదు.
Also Read: రాయలసీమ స్టైల్లో మటన్ వేపుడు చేసి చూడండి, ఒక్క ముక్క కూడా మిగలదు
రెండు వారంలో రెండు మూడు సార్లు ఇలా పల్లీల రైస్ చేసుకొని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా ఈ పల్లీలు ఎంతో ఉపయోగపడతాయి. వేరుశెనగ పలుకులను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. కండరాలను బలంగా మార్చే శక్తి పల్లీలకు ఉంది. వేరుశెనగ పలుకులను పోషకాల పవర్ హౌస్ చెప్పుకోవచ్చు. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. రోజు గుప్పెడు పల్లీలను తినేందుకు ప్రయత్నించండి. మన శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ మనకు అందుతుంది.