Scrub Typhus Cases: ఏపీలోని 26 జిల్లాల్లోనూ స్క్రబ్ టైఫస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య పెరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిని ‘టిక్ లాంటి చిన్న కీటకం’ వ్యాపింపజేస్తుంది. ఇదిలా ఉంటే.. జనవరి 1 నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,678 అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,317 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి ?
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఓరియంటియా సుట్సుగముషి’ అనే రికెట్సియా కుటుంబానికి చెందిన బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియాను మోసుకెళ్లే కీటకం (మైట్ లార్వా) కుట్టినప్పుడు మనిషిలోకి ఇది సంక్రమిస్తుంది.
లక్షణాలు:
కీటకం కుట్టిన ప్రదేశంలో మొదట నల్లటి మచ్చ (ఎస్చార్), దద్దుర్లు ఏర్పడతాయి. దీని తర్వాత.. వారం నుంచి పది రోజుల కాలంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి.
సకాలంలో సరైన చికిత్స అందకపోతే.. పరిస్థితి తీవ్రమై తీవ్రమైన శ్వాసకోశ బాధ సిండ్రోమ్ , మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు (మెనింజైటిస్), కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
జిల్లాల వారీగా కేసులు:
ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు.
చిత్తూరు- 379
కాకినాడ -141
విశాఖపట్నం- 123
ఇవే కాక.. వైఎస్ఆర్ కడప 94, నెల్లూరు 86, అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, కర్నూలు 42, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, అన్నమయ్య 32, గుంటూరు 31, నంద్యాల 30 కేసులు నమోదయ్యాయి.
రోగ నిర్ధారణ & చికిత్స:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యపై అవగాహన లోపించడం, సరైన సమయంలో గుర్తించకపోవడం మరణాలకు కారణమవుతోంది. జ్వరం తగ్గకపోతే.. సాధారణంగా మలేరియా, టైఫాయిడ్ లేదా డెంగ్యూ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.
జ్వరంతో పాటు శరీరంపై నల్ల మచ్చలు (ఎస్చార్) లేదా దద్దుర్లు కనిపిస్తే.. వెంటనే ELISA పరీక్ష ద్వారా స్క్రబ్ టైఫస్ను నిర్ధారించుకోవడం మంచిది.
చికిత్స: స్క్రబ్ టైఫస్ సోకిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్తో సులువుగా చికిత్స అందించవచ్చు.
మరణాల రేటు: సకాలంలో చికిత్స అందితే మరణాల రేటు 2% కంటే తక్కువగా ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే.. రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
వ్యాధి సంక్రమించే కాలం:
సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నివారణ చర్యలు:
ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించనప్పటికీ.. కీటకం కుట్టిన వ్యక్తి అనారోగ్యం పాలవుతారు. కాబట్టి.. జాగ్రత్తలు తప్పనిసరి.
శరీరాన్ని కప్పి ఉంచడం: తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల కొట్టాలు, వ్యర్థాలు పేరుకుపోయే ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులు పూర్తి చేతుల షర్ట్ , ప్యాంటు, సాక్స్, షూ ధరించాలి.
పిల్లల రక్షణ: పిల్లలు ఆరుబయట ఆడుకునేటప్పుడు కాళ్ళు , చేతులను కప్పి ఉంచే బట్టలు ధరించడం ద్వారా వారిపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదాన్ని తగ్గించాలి.
ఇంటి పరిశుభ్రత: ఇళ్లలోని పాత పరుపులు, దిండ్లను మార్చాలి లేదా వాటిని ఉపయోగించే ముందు శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ కీటకాలు వాటిలో ఆశ్రయం పొందే అవకాశం ఉంది.
జ్వరం, నల్ల మచ్చలు లేదా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి స్క్రబ్ టైఫస్ కోసం పరీక్ష చేయించుకోవడం అత్యవసరం