Stay fit after 40: నలభై ఏండ్లు దాటాక మానవ శరీరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాల శక్తి, ఎముకల సాంద్రత, మెటబాలిజం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఆ వయసులో శరీరంలో జరిగే మార్పులను ఎదుక్కోవాలంటే సరైన వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. ప్రతి మనిషి జీవితంలోనూ 40 ఏళ్లు దాటాక ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది. అలాంటి సమయంలో చేసే కసరత్తులు దీర్ఘకాలిక ఆరోగ్యానికి, చురుగ్గా ఉండేందుకు, సంతోషానికి తోడ్పడతాయి. కాబట్టి.. రోజులో కనీసం 30 నిమిషాలు కొన్ని వ్యాయామాలు చేస్తే నాలుగు పదుల వయసులోనూ ఫిట్గా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. ఆ వ్యాయామాలేవో చూసేద్దాం రండి..
మానవ శరీరానికి నడక సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రోజులో కనీసం 30 నిమిషాలు వేగంగా నడిస్తే.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు వాకింగ్తో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అలాగే ఈ వాకింగ్ వలన మోకాళ్లు, కీళ్ల జాయింట్లపై ఒత్తిడి పడకుండా శరీరానికి తగిన వ్యాయామం అందుతుంది. ఎముకలు దృఢంగా మారడానికి, అధిక బరువును తగ్గించుకోవడానికి నడక ఓ అద్భుతమైన వ్యాయామంగా చెప్పవచ్చు.
Read Also: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్గా మారిపోండి!
40 ఏళ్లు దాటాక శరీరంలోని స్నాయువులు, కండరాలు గట్టిపడుతుంటాయి. ఈ వయసులో చేసే యోగాసనాలు ఆ గట్టితనాన్ని తగ్గించి, జాయింట్లను దృఢంగా మారుస్తాయి. దీని కోసం.. త్రికోణాసనం, పవనముక్తాసనం, తాడాసనం వంటివి చేస్తే శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. అలాగే శ్వాసక్రియ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, మానసిక స్థైర్యాన్ని కల్పిస్తాయి. ఈ యోగాసనాలు నిత్యజీవితంలో కూర్చోవడం, లేవడం, నిల్చోవడంలో సహాయపడతాయి. దీంతోపాటు ఎముకల సాంద్రత తగ్గిపోకుండా ఈ యోగాసనాలు రక్షణ కల్పిస్తాయి.
చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఈత కొడుతుంటారు. ఎందుకంటే.. నీటిలో చేసే వ్యాయామాలకు ఎముకలపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ మొత్తం శరీరంలోని కండరాలను పని చేయిస్తుంది. దీనిని ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామంగా కూడా చెప్పవచ్చు. స్విమ్మింగ్ హార్ట్ పల్స్రేటును నియంత్రిస్తుంది. అలాగే నీటిలో ఈతకొట్టడం అనేది మోకాళ్లు, వెన్నెముక నొప్పి ఉన్నవారికి చాలా అనుకూలమైన వ్యాయామం అంటారు నిపుణులు.
వ్యాయామం అంటే కేవలం కండరాల కదలిక మాత్రమే కాదు. ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు శరీరానికి ప్రాణాన్ని పోస్తాయి. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు ప్రాణాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే శ్వాసక్రియ సరైన పద్ధతిలో జరుగుతుంది. ఈ ప్రాణామాయం వలన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ వ్యాయామం శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
Read Also: బోరింగ్ వర్కౌట్స్తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!