చపాతీలు, రోటీలు మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు గట్టిగా అప్పడాల్లాగా వచ్చేస్తాయి. వాటిని తినలేక ఇబ్బంది పడేవారు ఎంతోమంది. మన భారతదేశంలో చపాతీలను, రోటీలను మధ్యాహ్న భోజనంలో, రాత్రి భోజనంలో తినేవారే ఎక్కువమంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో రోటీలే తిని జీవిస్తారు. ఇక బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా తెలుగు రాష్ట్రాల్లో చపాతీలను అధికంగా తింటున్నారు. అయితే గోధుమలతో చేసిన రోటీలు చపాతీలు, మెత్తగా రావాలంటే చిన్న చిట్కా ఉంది. మీరు పిండిని పిసుకుతున్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి.
నూనె కలపండి
చపాతీలు మృదువుగా రావాలంటే పిండిని పిసుకుతున్నప్పుడే మీరు ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను నూనెను వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒక పావు గంట సేపు మూత పెట్టి ఆ పిండిని పక్కన ఉంచేయండి. ఆ తర్వాత చపాతీలు చేస్తే మెత్తగా వస్తాయి. ముఖ్యంగా చపాతీలను మడతలు పెట్టి చేయడం వల్ల అవి బాగా పొంగుతాయి.
పంచదార పొడి
చపాతీ పిండి కలుపుతున్నప్పుడు పంచదార పొడిని వేసి పిండి కలిపి నీళ్లలో వేసి కరగబెట్టాలి. తరువాత ఉప్పును, ఆ తర్వాత గోధుమపిండిని వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల రోటీలు మృదువుగా వస్తాయి. ఉబ్బినట్టు అవుతాయి. అయితే పంచదారను అధికంగా వేశారంటే చపాతీలు తీయగా వచ్చేస్తాయి. కాబట్టి చిటికెడు మాత్రమే వేయండి. అది నీటిలో కరిగేటట్టు చూసుకోండి.
నెయ్యి లేదా బటర్
చపాతీ పిండిని కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసినా కూడా అవి మెత్తగా వస్తాయి. లేదా చపాతీ చేసిన వెంటనే పైన కాస్త నెయ్యిని లేదా బటర్ ను రాసినా కూడా అవి మెత్తగా అవుతాయి. అలాగే పిండిని పిసుకుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. అలా గోరువెచ్చని నీటితో చేసిన పిండితో చపాతీలు ఒత్తితే మృదువుగా వస్తాయి. అందరూ ఇష్టంగా తింటారు.
పిండిని పిసికిన తర్వాత దాన్ని గాలికి వదిలేయకండి. పైన కచ్చితంగా మూతను పెట్టాలి. లేదా ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి పెట్టాలి. ఇలా చేస్తే రోటీలు లేదా చపాతీలు మృదువుగా వస్తాయి. లేకుంటే గాలికి ప్రభావితమైన పిండి చపాతీలను గట్టిగా వచ్చేలా చేస్తుంది.
పిండి కలుపుకున్న తర్వాత దానిపై తడి గుడ్డను కాసేపు ఉంచితే మంచిది. ఇలా చేయడం వల్ల పిండి మరింత మృదువుగా అవుతుంది. ఆ పిండితో చేసిన చపాతీలు, రోటీలు మెత్తగా వస్తాయి. చిన్న పిల్లల సైతం తినేలా ఇవి టేస్టీగా, నమలడానికి సులువుగా ఉంటాయి.