Unhealthy Lifestyle Habits| పరుగులు తీసే జీవనశైలిలో ప్రజల జీవితం వేగంగా మార్పుచెందుతోంది. అయితే ఈ మార్పుల ప్రభావం ఆహారపు అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లో వంట చేసుకుని కుటుంబంతో కలిసి భోజనం చేయడమంటే అందరూ ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ప్రతి వేళా హోటళ్లకే పరుగులు. పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగ ప్రమోషన్లు వంటి వేడుకలు.. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి హోటళ్లలో జరుపుకోవడం సాధారణంగా మారిపోయింది. అయితే ఈ హంగామా వెనుక ఆరోగ్యానికి పెనుముప్పు దాగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తక్కువ ధరల్లో నాణ్యతలేని పదార్థాలతో రుచికరంగా కనిపించే భోజనాలు అందించేందుకు.. హోటళ్ల యజమానులు ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను విరివిగా వాడుతున్నారు. చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద హోటళ్ల వరకూ ఈ పరిస్థితే కనిపిస్తోంది. క్యాన్సర్ బాధితుల్లో సుమారు 53 శాతం మంది హోటల్ ఫుడ్ వల్లే అనారోగ్యానికి గురవుతున్నారని చాలా సర్వేల్లో తేలింది.
హోటళ్లలో రంగులు, వాసనలు, రుచి కోసం మెటానిల్ ఎల్లో, టార్ట్రాజిన్, సన్సెట్ యెల్లో, కాటారజ్, బ్రిలియంట్ బ్లూ, రోడ్మన్-బీ వంటి నిషేధిత రసాయనాలు వాడుతున్నారు. ఇవి చిన్నారుల్లో నిద్రలేమి, నర సంబంధిత సమస్యలు, పెద్దలలో క్యాన్సర్, థైరాయిడ్, అలర్జీలు వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి పిల్లల ఆహారాలలోనూ ఇవే కలుపుతున్నారు.
ఇక పార్టీ కల్చర్ విషయానికి వస్తే.. గతంలో మాత్రమే పట్టణాల్లో కనిపించేది. ఇప్పుడు గ్రామాల్లో కూడా వారం వారం పార్టీలు, కుటుంబ ఆహార విందులు సర్వసాధారణమైపోయాయి. వీకెండ్ డిన్నర్లు, లంచ్ల పేరుతో హోటళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. ఖరీదైన వంటకాలు తింటున్నామన్న తృప్తి వెనుక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది.
అంతేకాదు, జిల్లాలో లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్న 5వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా పనిచేస్తున్నాయి. వీటిలో తక్కువ సంఖ్యలో మాత్రమే ఆహార నాణ్యత ప్రమాణాల శాఖల నుండి లైసెన్స్ పొందినవిగా ఉన్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో నియంత్రణ చేయాల్సిన వ్యవస్థ వేగంగా పనిచేయలేకపోతోంది. హోటళ్ల నుంచి నెలకు 12 శాంపిల్స్ సేకరించి, ప్రయోగశాలలో పరీక్షించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా, అవి పూర్తిగా అమలవ్వడం లేదు.
హోటళ్లలో మృత్యువుతో సమానమైన మరో అంశం – కల్తీ పదార్థాల వాడకం. పశువుల ఎముకల నుండి తయారు చేసిన ద్రావణాన్ని నూనెల్లో కలిపి వాడుతున్నారు. మిరపకాయల్లో రంగు కోసం సూడాన్ రంగులు, పసుపులో మెటానిల్ ఎల్లో వాడుతున్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వినియోగించడం వలన అల్సర్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి.
Also Read: హై బిపితో బాధపడుతున్నారా?.. రక్తపోటు తగ్గించడానికి ఏ ఫుడ్స్ తినాలి? ఏవి తినకూడదో తెలుసా?
అంతేకాదు, మాంసాహార వంటల్లో అనారోగ్యానికి గురైన గొర్రెలు, మేకలను వధించి ఉపయోగిస్తున్నారు. పాలిథిన్ కవర్లలో వేడి భోజనం ప్యాక్ చేస్తూ ప్లాస్టిక్ రసాయనాలను భోజనంలోకి మిక్స్ చేస్తున్నారు. నిషేధిత క్యాట్ ఫిష్లను కూడా మామూలు చేపలుగా విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్లలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కలిపి అందిస్తున్నారని ఆరోగ్యాధికారుల తనిఖీల్లో తేలింది.
ఈ పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, రుచికరమైన ఆహారమే ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, హోటల్ ఆహారంపై ఆధారపడకుండా, ఇంట్లో తయారుచేసిన భోజనాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే మన ఆరోగ్యానికి భరోసా ఉంటుంది.