Water Purifier: ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. అందుకే ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్, టీవీల కంటే ముందుగా దర్శనమిచ్చేది వాటర్ ప్యూరిఫైయర్. అయితే, మన ప్రాణాలు కాపాడుతుందని మనం నమ్ముతున్న ఈ వాటర్ ప్యూరిఫైయరే, మన నిర్లక్ష్యం వల్ల నెమ్మదిగా మనల్ని రోగాల పాలు చేస్తోందని మీకు తెలుసా? ఇటీవలే ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్స్’ (IJCRT) ప్రచురించిన ఒక అధ్యయనంలో వాటర్ ప్యూరిఫైయర్ల వాడకంలో మనం చేసే తప్పుల వల్ల ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయో స్పష్టంగా వివరించారు.
టీవీల్లో వచ్చే సెలబ్రిటీల ప్రకటనలు చూసి
చాలామంది కేవలం పెద్ద బ్రాండ్ పేరు చూసో, లేదా టీవీల్లో వచ్చే ఆకర్షణీయమైన సెలబ్రిటీల ప్రకటనలు చూసో వేల రూపాయలు ఖర్చు చేసి ప్యూరిఫైయర్లను కొనేస్తుంటారు. కానీ, ఆ పరికరాన్ని అమర్చే ముందు తమ ఏరియాలో వచ్చే నీటి నాణ్యత లేదా టీడీఎస్ (Total Dissolved Solids) లెవల్స్ ఎంత ఉన్నాయో అస్సలు గమనించరు. ఒకవేళ మున్సిపల్ నీరు సరఫరా అయ్యే ప్రాంతం అయితే అక్కడ సాధారణంగానే టీడీఎస్ తక్కువగా ఉంటుంది.
also read :ఆ ఒక్క పిల్లి లేకపోతే మన రోడ్లపై ఈ లైట్లు ఉండేవి కావు.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ స్టోరీ!
అలాంటి చోట కేవలం యూవీ (UV) లేదా యూఎఫ్ (UF) ప్యూరిఫైయర్ సరిపోతుంది. కానీ తెలియక అక్కడ కూడా భారీ ఆర్ఓ (RO) సిస్టమ్స్ పెట్టడం వల్ల నీటిలోని సహజసిద్ధమైన ఖనిజాలు పూర్తిగా నశించిపోతాయి. బోరు నీరు వాడే చోట మాత్రమే ఆర్ఓ ప్యూరిఫైయర్ అవసరమవుతుంది. టీడీఎస్ స్థాయి 50 కంటే తగ్గిపోతే ఆ నీటిని సైన్స్ భాషలో ‘డెడ్ వాటర్’ అంటారు. ఇలాంటి నీటిని తాగడం వల్ల శరీరానికి అందాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం లోపించి, కీళ్ల నొప్పులు మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
ఫిల్టర్లలో పేరుకుపోయే బ్యాక్టీరియా
మరో ప్రధానమైన సమస్య సర్వీసింగ్ నిర్లక్ష్యం చేయడం. ఫిల్టర్లలో పేరుకుపోయే బ్యాక్టీరియా కూడా మనకు పైకి కనిపించదు. ప్యూరిఫైయర్ పూర్తిగా ఆగిపోయే వరకు దాని జోలికి వెళ్లని వారు చాలా మంది ఉన్నారు. సకాలంలో ఫిల్టర్లు మార్చకపోతే, అందులో పేరుకుపోయిన మట్టి, నాచు మరియు ప్రమాదకర రసాయనాలు మనం తాగే నీటిని మరింత విషతుల్యంగా మారుస్తాయి. కనీసం ఏడాదికి ఒకసారైనా నిపుణుడైన టెక్నీషియన్తో పూర్తి సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.
also read :మెగా బ్రదర్స్ను తిట్టారా?.. ఆడియో వెనుక పొలిటికల్ స్కెచ్.. అసలేం జరిగింది?
అలాగే ప్యూరిఫైయర్ లోపల ఉండే స్టోరేజ్ ట్యాంకును నెలకొకసారైనా శుభ్రం చేయాలి. లేదంటే ఆ ట్యాంక్ గోడలకు ఒక రకమైన జిగురు లాంటి పొర ఏర్పడి బ్యాక్టీరియాకు నివాసంగా మారుతుంది. ఒకవేళ ఊరు వెళ్లి వచ్చి రెండు మూడు రోజులు వాడకుండా ఉంటే, ట్యాంక్లోని పాత నీటిని పూర్తిగా పారబోసి, కొత్తగా నిండిన నీటిని మాత్రమే తాగాలి.
కరెంట్ ఆదా చేయడం కోసం
ఇక కరెంట్ ఆదా చేయడం కోసం చాలా మంది ప్యూరిఫైయర్ స్విచ్ను మాటిమాటికీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు. ఆధునిక ఆటోమేటిక్ ప్యూరిఫైయర్లు ట్యాంక్ నిండగానే అవే ఆగిపోయే సెన్సార్లను కలిగి ఉంటాయి. పదే పదే మ్యాన్యువల్గా ఆఫ్ చేయడం వల్ల ఈ సెన్సార్లు పాడవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్ఓ సిస్టమ్ నుండి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ పైపును మురికి కాలువల్లో లేదా సింక్ లోపల లోతుగా ఉంచుతుంటారు.
also read :రామ్ చరణ్ ‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ.. ఢిల్లీ ప్రెస్ మీట్లో ఊహించని లీక్!
దీనివల్ల బయట ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా ఆ పైపు ద్వారా రివర్స్ మోడ్లో ప్యూరిఫైయర్ లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ వేస్ట్ వాటర్ ను పారబోయకుండా ఒక బకెట్లో పట్టి మొక్కలకు పోయడానికి లేదా ఇల్లు తుడవడానికి వాడుకోవడం మంచిది. మన అజాగ్రత్త వల్ల అమృతం లాంటి నీరు కూడా విషంగా మారే అవకాశం ఉంది కాబట్టి, టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.