పిల్లలు మధ్యాహ్న సమయంలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ సమయం స్కూల్లో గడపాల్సి వచ్చినప్పుడు నిద్రపోయేందుకు కుదరదు. ఈ కారణంగానే కొన్ని దేశాల్లో పిల్లలకు మధ్యాహ్నం వేళ నిద్రపోయేందుకు పాఠశాలల్లో సౌలభ్యం కల్పిస్తున్నారు.
జపాన్ మరియు చైనా పాఠశాలల్లో చాలా చోట్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. నిద్రపోయేందుకు ఈ చిన్న విరామాలు.. విద్యార్థులను తాజాగా, చురుకుగా చేస్తాయి. మధ్యాహ్నం నిద్రపోతే.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, చదువుకోవడంలో పిల్లలు మరింత చురుగ్గా వ్యవహరిస్తారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాఠశాలలు ఈ నిద్ర సమయాన్ని రోజువారీ షెడ్యూల్లో అధికారికంగా చేర్చాయి.
భోజనం తర్వాత విద్యార్థులు తరచూ నిద్రమత్తుగా ఉంటారు. బరువైన భోజనం, నిరంతం చదువు వల్ల శక్తి త్వరగా తగ్గిపోతుంది. మధ్యాహ్న తరగతుల్లో పిల్లలు.. ఏకాగ్రత తగ్గడంతో సరిగా చదువుకోలేరు. ఈ సమస్యను పరిష్కరించడానికి పాఠశాలలు చిన్న నిద్ర విరామాలు ప్రారంభించాయి.
జపాన్లోని అనేక పాఠశాలలు మధ్యాహ్నం నిద్ర విరామాన్ని అధికారికంగా అనుమతిస్తున్నాయి. ఆ సమయంలో తరగతి గదులు నిశ్శబ్దంగా, కొంచెం చీకటిగా ఉంటాయి. కొన్ని చోట్ల తక్కువ శబ్దంలో మెలొడీ సంగీతం ఏర్పాట్లు కూడా ఉంటాయి. దీంతో నిద్ర పోవడానికి మంచి వాతావరణం లభిస్తుంది. ఈ నిద్ర సాధారణంగా 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
నిద్ర విరామాలు ప్రారంభించిన తర్వాత ఉపాధ్యాయులు.. పిల్లల్లో మంచి మార్పులు గమనించారు. విద్యార్థులు విరామం తర్వాత జరిగే తరగతుల్లో బాగా ఏకాగ్రత చూపుతున్నారు. క్రీడలు, ఇతర కార్యక్రమాల్లో కూడా మెరుగైన పనితీరు కనిపిస్తోంది. అలసట వల్ల మెడికల్ రూమ్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గింది. కాసేపు నిద్ర పోవడం మెదడును తాజాగా చేస్తుంది.
చైనాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్నం నిద్ర సాధారణం. భోజన సమయంలో సరిపడా విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పాఠశాలలు పడుకోవడానికి అనువైన కుర్చీలు, డెస్కులు ఏర్పాటు చేశాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఈ విశ్రాంతిని ముఖ్యమని భావిస్తారు.
చైనా ప్రభుత్వం పాఠశాలలు విద్యార్థులకు సరిపడా నిద్ర ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రోజుకు సుమారు 10 గంటలు నిద్రపోవాలి. తరగతి సమయాలను కూడా అనుకూలంగా మార్చారు.
కాసేపు నిద్రపోవడం.. జ్ఞాపకశక్తి, నేర్చుకునే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడి, మానసిక అలసట తగ్గుతాయి. 10 నుంచి 30 నిమిషాల నిద్ర మాత్రమే సరిపోతుంది.
జపాన్, చైనాలో విశ్రాంతిని ఉత్పాదకతలో భాగంగా చూస్తారు. కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో కూడా మధ్యాహ్న నిద్రకు అనుమతి ఉంటుంది. ఈ సంస్కృతి పశ్చిమ దేశాల నుంచి భిన్నంగా ఉంటుంది.
ఎక్కువ సేపు సమయం చదువు, కోచింగ్ వల్ల అలసట ఎక్కువవుతుంది. మధ్యాహ్న నిద్ర విరామాలు శక్తిని తిరిగి ఇస్తాయి. చిరాకు, ఆందోళన నుంచి రక్షిస్తాయి.
మధ్యాహ్న నిద్ర కోసం ప్రత్యేక ఫర్నిచర్, రీక్లైనింగ్ కుర్చీలు, బ్లాకౌట్ కర్టెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాలను సమర్థిస్తున్నారు.
Also Read: తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది
అలసటతో విద్యార్థులు ఎక్కువసేపు నేర్చుకోలేరు. చిన్న నిద్ర విరామాలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచి మొత్తం విద్యా వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఈ పద్ధతిని అనుసరించవచ్చు.