ACB Bribe: అమ్మోరు సాక్షిగా లంచం తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ అరెస్టులు సచివాలయంలోని పోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
సెక్రటేరియట్ లో ఆనందేశి రాఘవేందర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ లో ఉన్న టీఎస్డీసీ ఆఫీస్ లో మేడి వినోద్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ ఓ వ్యక్తి పేదరికం కారణంగా తనకు నగదును మంజూరు చేయాలని సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఇవ్వటానికి రాఘవేందర్, వినోద్ కలిసి లక్ష రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. డబ్బు ముట్టజెబితేనే చెక్కు ఇస్తామని చెప్పారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.
Also read: జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!
ఈ క్రమంలో రాఘవేందర్, వినోద్ లను పట్టుకోవటానికి ఏసీబీ అధికారులు వలపన్నారు. దాని ప్రకారం గురువారం సచివాలయంలోని పోశమ్మ మందిరం వద్ద వినోద్ బాధితుని నుంచి లక్ష రూపాయలు తీసుకుని రాఘవేందర్ చేతికి ఇవ్వగానే దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచంగా తీసుకున్న లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.
Also read: బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం