Ganesha immersion reason: మనం జరుపుకునే పండగల్లో వినాయక చవితికి ఉండే ప్రత్యేకతే వేరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ ఇది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడిని చివరి రోజు నిమజ్జనం చేయడం మన సంప్రదాయం. అయితే .. చాలా మందికి వచ్చే సందేహం ఏటంటే.. ఎంతో భక్తితో పూజించిన దేవుడి విగ్రహాన్ని నీటిలో ఎందుకు నిమర్జనం చేస్తారు? అలాగే వినాయకుడి పుట్టక వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రెండు విషయాలపై ఉన్న ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం.. శివుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటిపై ఉన్న పసుపు, చందనం ముద్దతో ఒక బాలుడి రూపాన్ని సృష్టించి అతనికి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడిని తన ద్వార పాలకుడిగా ఉంచి.. ఎవరినీ లోపలికి అనుమతించవద్దని చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కైలాస నాథుడైన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు. తనను అడ్డుకున్న ఆ బాలుడు ఎవరో తెలియక శివుడు తన త్రిశూలంతో అతని తలను ఖండిస్తాడు.
తర్వాత జరిగిన అసలు విషయం తెలిసి పార్వతీ దేవి విలపించగా, శివుడు ఉత్తర దిశగా నిద్ర పోతున్న ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడి మొండానికి అమర్చి పునర్జన్మ ప్రసాదిస్తాడు. ఇదంతా కేవలం ఒక కథ లాగా కనిపించినా.. దీని వెనక మానవ శరీర తత్వం, ప్రకృతికి సంబంధించిన గొప్ప తాత్విక రహస్యం దాగి ఉంది. పసుపు శరీరాన్ని, ప్రాణం పోయడం అనేది జీవ శక్తిని సూచిస్తుంది.
మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వెనక ప్రకృతి ధర్మం ఉంది. ‘మట్టిలో పుట్టాము, మట్టిలోనే కలవాలి’ అనేది సృష్టి సహజ సిద్ధమైన నియమం. మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి, ఆ తర్వాత మళ్లీ నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ విగ్రహం మళ్లీ ప్రకృతిలో కలిసి పోతుంది. ఇది జనన మరణ చక్రానికి ప్రతీక. మనం దేవుడిని విగ్రహ రూపంలో ఆహ్వానించి, పూజలు ముగిసిన తర్వాత ఆ దివ్య శక్తిని మళ్లీ విశ్వంలోకి పంపిస్తామనే భావన దీని వెనక ఉంది.
Also Read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే..అపనిందలు వస్తాయా? అసలు రహస్యం ఇదే!
ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వాడాలని గట్టిగా చెబుతున్నారు. ఈ మట్టి విగ్రహాలు నీటిలో ఈజీగా కరిగిపోతాయి కాబట్టి జల కాలుష్యం జరగదు.
వినాయక నిమజ్జనం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. అది ప్రకృతి తో మనం మమేకం కావడానికి, సృష్టి లోని మార్పులను స్వీకరించడానికి ఒక చక్కటి వేడుక. ఈ చవితికి మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందాం!