Fridge Water: ఎండలు మండిపోతుంటే.. బయట నుంచి రాగానే ఫ్రిజ్ తెరిచి ‘చిల్డ్’ వాటర్ తాగేస్తుంటాం. చల్లటి నీరు ఆ క్షణానికి గొంతులో అమృతంలా అనిపించినా.. ఈ అలవాటే మన కొంపముంచుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు! నిజానికి ఫ్రిజ్ నీరు తాగడం అంటే.. మనకు మనమే రోగాలను ఆహ్వానించడమే. గొంతు నొప్పి నుంచి మొదలై, మీ జీర్ణ వ్యవస్థను ఇది పూర్తిగా చిందర వందర చేసేస్తుంది. అందుకే.. ఈ వేసవిలో ఆ చల్లని ‘విషాన్ని’ పక్కన పెట్టి, మన ఆరోగ్యాన్ని కాపాడే పాత కాలపు పద్ధతుల వైపు మళ్లడం చాలా ముఖ్యం. అసలు ఫ్రిజ్ నీరు మన శరీరంతో ఎలా ఆడుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి అది ఒక ‘షాక్’!
మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37°C ఉంటుంది. మనం ఒక్క సారిగా 5°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రిజ్ లోని నీళ్లను తాగినప్పుడు, మన బాడీ ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. ఆ అతి చల్లని నీటిని శరీరం తట్టుకునే వేడికి మార్చుకోవడానికి లోపల వ్యవస్థ అంతా విపరీతమైన శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని వల్ల మనకు ఎనర్జీ రావడానికి బదులు, ఉన్న శక్తి హరించుకుపోతుంది.
జీర్ణక్రియకు బ్రేకులు:
మనం చల్లటి నీరు తాగినప్పుడు కడుపులోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు చల్లటి నీటి వల్ల గడ్డకట్టి, సరిగ్గా అరగవు. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఫ్రిజ్ నీటిని తాగడం వల్ల వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి.
Also Read: గుండెను దెబ్బతీసే 6 అలవాట్లు.. వీటిని వెంటనే వదిలేయండి!
గుండె ,గొంతుపై ప్రభావం:
ఫ్రిజ్ నీరు తాగడం వల్ల గొంతులో ఉండే శ్లేష్మం పొర దెబ్బతింటుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుకు దారి తీస్తుంది. అంతేకాదు.. మన శరీరంలోని ‘వేగస్ నాడి’పై ఈ చల్లదనం ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా గుండె స్పందన రేటు తగ్గే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీ పళ్ళు కూడా ఈ అతి చల్లదనానికి సెన్సిటివ్గా మారిపోయి, జివ్వుమని లాగుతాయి.
మట్టి కుండ ప్రయోజనం:
చల్లదనం కావాలనుకుంటే.. మన పాత కాలపు పద్ధతికి మించినది లేదు. మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. ఇది మన శరీరానికి హాని చేయదు. పైగా మట్టిలోని ఖనిజాలు నీటిలో చేరి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కుండ నీరు తాగడం వల్ల నీటిలో pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది.