కడుపులో ఉబ్బరం, గ్యాస్ (యాసిడిటీ), భోజనం సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో చాలామంది ప్రతిరోజూ యాసిడిటీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ముఖ్యంగా పాంటోప్రాజోల్, రాబిప్రజోల్ లాంటి మందులు ఉదయం టిఫిన్ ముందు లేదా భారీ భోజనం తర్వాత తీసుకోవడం సాధారణంగా మారింది.
అయితే ఈ మందులను సంవత్సరాల తరబడి వైద్యుల సలహా లేకుండా వాడటం మంచిది కాదని గురుగ్రామ్ లోని షాల్బీ ఇంటర్నేష్నల్ హాస్పిటల్, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వీణూ అగర్వాల్
హెచ్చరించారు. అవసరమైతే మాత్రమే వీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు.
డాక్టర్ వీణూ అగర్వాల్ ప్రకారం.. చాలా మంది రోగులు తమ ఆరోగ్య వివరాలు చెప్పేటప్పుడు యాసిడిటీ మందుల గురించి ప్రస్తావించరు. కొందరు ఏళ్ల తరబడి ప్రతిరోజూ పాంటోప్రాజోల్ వంటి మందులు వాడుతున్నప్పటికీ వైద్యులకు తెలియజేయరు. ఈ మందులు కేవలం జీర్ణక్రియపైనే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థలపై కూడా ప్రభావం చూపవచ్చని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులపై వీటి ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
మన జీర్ణవ్యవస్థలో కోట్ల సంఖ్యలో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఆహార జీర్ణం చేయడం పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే పేగులు ఆరోగ్యంగా ఉండడడం చాలా ముఖ్యం.
పాంటోప్రాజోల్, ఒమెప్రాజోల్, రాబెప్రాజోల్ లాంటి మందులు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పిపిఐ) అనే వర్గానికి చెందినవి. ఈ పిపిఐ ఔషధాలు కడుపులో గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కడుపులో ఆమ్లం తగ్గడం వల్ల పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యత మారవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని అధ్యయనాల్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. ప్రతిరోజూ పిపిఐ ఉపయోగించని రోగుల్లో వ్యాధి పురోగతి నెమ్మదిగా ఉండే అవకాశం కనిపించింది. మరో పెద్ద అధ్యయనంలో వేలాది మంది రోగుల డేటాను విశ్లేషించారు. తరచుగా పిపిఐ వాడేవారిలో క్యాన్సర్ త్వరగా వ్యాపించే ప్రమాదం కొంత ఎక్కువగా ఉండవచ్చని గుర్తించారు. అయితే ఈ పరిశోధనలు ప్రత్యక్ష కారణాన్ని నిరూపించలేదని నిపుణులు చెబుతున్నారు.
అరుదుగా అయినప్పటికీ పిపిఐ మందుల వల్ల మూత్రపిండాలకు హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ మందులను నిరంతరం వాడేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
యాసిడిటీ మందులను ఒక్కసారిగా ఆపడం ప్రమాదకరం. అలా చేస్తే యాసిడిటీ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ మార్పు చేయాలన్నా తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
Also Read: ఉదయన్నే ఇవి తింటే కడుపు నిండా గ్యాస్, ఛాతీలో మంట..
ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు యాసిడిటీ సమస్యను తగ్గించవచ్చు. రోజులో చిన్న చిన్న మోతాదుల్లో ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ అంటే అధిక కారం ఉండే ఆహారాలను తగ్గించాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. ఈ అలవాట్లు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
యాసిడిటీ మందులు ఉపయోగకరమైనవే. కానీ వాటిని జీవితాంతం వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడకూడదు. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా యాసిడిటీని మెరుగ్గా నియంత్రించవచ్చు.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మందులు ప్రారంభించే ముందు లేదా ఆపే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.