Amitabh Bachchan:బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898AD’లో అశ్వద్ధామ పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక సినిమాలే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో.. షోలతో కూడా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు అమితాబ్ బచ్చన్. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ వంటి షోలతో దూసుకుపోతున్న అమితాబ్.. అర్థరాత్రి సమయంలో అయోధ్యలో ల్యాండ్ డీల్ చేసుకున్న విషయంపై సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి, ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా వ్యవస్థాపకుడు చైర్మన్ అభినందన లోధా తాజాగా జరిగిన సమ్మిట్ లో గుర్తుచేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన “హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ – 2026″లో అభినందన్ లోధా మాట్లాడుతూ..” 2023లో నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు.. రాత్రి 3 గంటల సమయంలో నా ఫోన్ కి రెండు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను అమితాబ్ కుదిరినప్పుడు తిరిగి కాల్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే నేను తిరిగి ఫోన్ చేశాను. ఆయన నేను ఉత్తర ప్రదేశ్ కి చెందిన వాడిని.. అయోధ్యలో నేను భూమి కొనాలనుకుంటున్నాను అని ఆయన నాతో అన్నారు. నేను మీతో ధర గురించి ఎలా మాట్లాడగలను అని అడిగితే.. ఆయన 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నాను అని వెల్లడించారు. దానికి నేను సుమారుగా రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాను. అయితే ఆ మరుసటి రోజే అమితాబ్ బచ్చన్ తన బ్యాంక్ అకౌంట్ నుండి రూ.15 కోట్లు నాకు బదిలీ చేశారు “అంటూ లోధా నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ALSO READ:బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!
మొత్తానికైతే అర్ధరాత్రి సమయంలో అయోధ్యకి సంబంధించిన భూమిని కొనుగోలు చేయడానికి ఫోన్ చేసి మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ చేసి అక్కడ భూమిని సొంతం చేసుకోవడంపై పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అయోధ్యలో అమితాబ్ బచ్చన్ గత కొన్ని సంవత్సరాలుగా తన రియల్ ఎస్టేట్ పెట్టబడులను క్రమంగా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. 2026 మార్చిలో” ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా” నుంచి రూ.35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇకపోతే అయోధ్యలో ఈయన కొనుగోలు చేసిన భూమి ది సరయూ ప్రాజెక్టుకి సమీపంలో ఉంది. ఇకపోతే అంతకుముందు 2025 మేలో ఇదే ప్రాజెక్టుకి ఆనుకొని రూ.40 కోట్ల విలువైన 25వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. అలాగే 2024లో హెచ్ఓఏబిఎల్ ప్రధాన మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ ది సరయులోని 10వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ.14.5 కోట్లకు దక్కించుకున్నారు.
ఇకపోతే ఇక్కడ భూమిని కొనుగోలు చేయడం పై అభినందన్ లోధా మాట్లాడుతూ..” అమితాబ్ బచ్చన్ చేసిన పెట్టుబడి.. భూమిని తరతరాలకు విలువను అందించే ఆస్తిగా చూసే ఉమ్మడి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మా సంస్థలో భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వం గానే మేము చూస్తాము. అయోధ్యలో ఈ వారసత్వానికి మరింత ప్రత్యేకమైన అర్థం ఉంది . వారసత్వం , విశ్వాసం రెండు కలిసే ప్రదేశంగా ఇది నిలుస్తోంది. ప్రభుత్వ పెట్టుబడులతో, మౌలిక వసతుల అభివృద్ధితో అయోధ్య దీర్ఘకాలిక భూమి పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుతోంది ” అంటూ కామెంట్లు చేశారు.