Actress Laya:పదహారణాల తెలుగమ్మాయి లయ (Laya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందం, అభినయంతో ఒకప్పుడు వరుస చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె.. కుటుంబ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. 1990 నుంచి 2000 మధ్య సంవత్సరాల కాలంలో వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న లయ.. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటి మాత్రమే కాదు కూచిపూడి డాన్సర్ కూడా.. అలాగే జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణిగా కూడా పేరు సొంతం చేసుకుంది. బాలనటిగా ‘భద్రం కొడుకో’ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత హీరోయిన్ గా ‘స్వయంవరం’ చిత్రంతో పేరు దప్పించుకుంది. మనసున్న మారాజు, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, శివరామరాజు, హనుమాన్ జంక్షన్ ఇలా ఒక్కటేమిటి మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి సాంప్రదాయ బద్ధమైన పాత్రలతో ప్రేక్షకులలో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది.
అలా కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన లయ అమెరికాలో స్థిరపడింది.. అక్కడ కుటుంబ బాధ్యతలతో పాటు కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. అయితే నటన పైన ఉన్న ఇష్టంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈమె.. అందులో భాగంగానే నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ అనే ఫ్యామిలీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. శివాజీ తో కలిసి కీలక పాత్ర పోషించింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో విషయాలను పంచుకున్న లయ.. ఎన్టీఆర్ (NTR ) సినిమా మిస్ చేసుకోవడం వల్లే ఎన్నో ఆఫర్లు కోల్పోయాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ALSO READ:Varanasi Movie: వారణాసి రేర్ రికార్డ్.. కలలో కూడా ఊహించని?
ఇంటర్వ్యూలో భాగంగా లయ మాట్లాడుతూ.. “ఒకసారి నేను పూర్తి కథ వినకుండానే నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక మంచి అవకాశం కోల్పోయాను. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో జగపతి బాబుకి భార్య పాత్రలో ఆఫర్ వచ్చింది. అయితే అది చిన్న పాత్ర అనుకుని తిరస్కరించాను. సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్ర ప్రభావం ఎంత ఉందో తెలిసి బాధపడ్డాను. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు కూడా కోల్పోయాను. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందేమో అనిపించింది. అమెరికాలో స్థిరపడిన తర్వాత నటనపై ఆసక్తి తగ్గలేదు. అందుకే తమ్ముడు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ సినిమా కోసం కొంచెం బరువు పెరగాలని చెప్పడంతో ప్రత్యేకంగా ప్రయత్నించి మరీ బరువు పెరిగాను. ఇక మళ్లీ సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమా కోసం మళ్లీ బరువు తగ్గే ప్రయత్నం చేశాను” అంటూ లయ తెలిపింది. మొత్తానికి అయితే రీ ఎంట్రీలో కూడా లయ ఎప్పటిలాగే వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.