Ramya Krishnan: గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో వరుస బాంబు బెదిరింపులు అటు ప్రజలను ఇటు సినీ సెలబ్రిటీలను కలవరపాటుకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని వస్తున్న ఈ బాంబు బెదిరింపులు పలు అనుమానాలకు తెర లేపుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లపై బాంబు బెదిరింపు దాడులు రాగా.. నిన్న హీరో అజిత్ (Hero Ajith) ఇంటికి కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) ఇంటికి కూడా బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో ఇద్దరు రాష్ట్ర మంత్రుల ఇళ్లతో సహా నటీనటులు అజిత్ , రమ్యకృష్ణ ఇళ్ళకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రులు కే ఎన్ నెహ్రూ, అన్బిల్ మహేష్ ఇళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లల్లో డాగ్స్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాము. అలాగే నటుడు అజిత్, నటి రమ్యకృష్ణ ఇళ్ళకి కూడా బాంబు బెదిరింపులు రావడంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు అంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ ఇంటి తోపాటు టీవీకే అధినేత , ప్రముఖ నటుడు విజయ్ దళపతి ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. వీరితోపాటు గవర్నర్ భవన్ కి కూడా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ , ప్రముఖ స్టార్ హీరో ధనుష్ తో పాటు త్రిష , నయనతార ఇళ్లకు కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, మెయిల్స్ అని పోలీసులు నిర్ధారించారు.
ALSO READ:Hero Dharmendra: క్షేమంగా డిస్చార్జ్ అయిన హీరో ధర్మేంద్ర!
ఇకపోతే ఈ విషయంపై అటు ప్రజలు, ఇటు సెలబ్రిటీలు అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇలా బాంబు బెదిరింపులు రావడం.. ఆ తర్వాత తనిఖీలు చేపట్టాక అవి ఫేక్ కాల్స్ అని, ఫేక్ మెసేజ్ లని గుర్తించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకవేళ ప్రతి దానిని ఇలాగే నిర్లక్ష్యంగా తీసుకుంటే.. భవిష్యత్తులో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి ఈ మెసేజ్ లు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాన్ని త్వరగా కనుక్కొని.. ప్రజలలో భయాందోళనలను పోగొట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఫేక్ కాల్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా దీనిపై త్వరగా అప్రమత్తం అవ్వాలి అని ఇటు నెటిజన్స్ కూడా కోరుతున్నారు.