Anupama Parameswaran: కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ లో భారీ పరాజయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అనుపమ కార్తికేయ 2 సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకిచేరింది. ఆ సినిమా తర్వాత అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారింది. అందులో బరువు తగ్గడంతో అందాల ఆరబోతకు కూడా సై అంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో గ్లామర్ ఒలకబోయని హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ సినిమాతో ఆ పేరును మొత్తం పోగొట్టేసుకుంది.
టిల్లు స్క్వేర్ లో లిల్లీ అనే పాత్రలో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అవ్వడమే కాకుండా ఆమె అందాల ఆరబోతకు ముగ్ధులు అయ్యారు. అయితే కొంతమంది మాత్రం అనుపమను అంత గ్లామర్ గా చూడలేకపోయారు. సౌందర్య, నిత్యమీనన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ తర్వాత అనుపమను ఆ లిస్టులో చేర్చారు. కానీ, ఈ ముద్దుగుమ్మ మాత్రం టిల్లు స్క్వేర్ తో ఆ హద్దులను దాటేసింది. ఇక ఈ సినిమా తర్వాత అనుపమ అటు తెలుగు ఇటు తమిళ్ ,మలయాళంలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ వస్తుంది.
చాలా కాలం తర్వాత అనుపమ మలయాళంలో నటిస్తున్న చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ కోర్టు డ్రామాలే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది, అందులోనూ టీజర్ లో అనుపమ న్యాయం కోసం పోరాడుతున్నట్లు చూపించడంతో ఆమెకు ఏం జరిగిందో ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందానికి షాక్ తగిలింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అందుకు కారణం ఆ టైటిల్ అని తెలిపింది. జానకి అనే పేరును తొలగించమని టైటిల్ లో కూడా ఆ పేరు ఉండడానికి వీల్లేదని సెన్సార్ బోర్డ్ ఖరాకండీగా చెప్పుకొచ్చింది. సీతాదేవికి మరో పేరు జానకి కావడంతో ఆ పేరును న్యాయపోరాటం చేసే ఒక మహిళకి పెట్టడానికి వీల్లేదని, దీనివల్ల వివాదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని తెలుపుతూ ఈ చిత్రం స్క్రీనింగ్ కి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది.
ఇక ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్నికృష్ణన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదని, సెన్సార్ బోర్డ్ నిర్మాతలకు కచ్చితంగా తెలిపింది. టైటిల్, ఆ పాత్ర పేరు మారిస్తే తప్ప సినిమాను రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదని, దాడికి గురైన అమ్మాయి పాత్రకు సీతాదేవికి మరో పేరు అయిన జానకి అనే పేరుని పెట్టలేమని అందుకనే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త మలయాళం లో హాట్ టాపిక్ గా మారింది మరి చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..? టైటిల్ మార్చి ఇంకే టైటిల్ పెడుతుందో చూడాలి.