Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో గిరిజన నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా సాధించిన ఘన విజయం నేపథ్యంలో నిర్వహించిన ‘మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్’కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ నటనపై, ఆయన పడ్డ కష్టంపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రశంసల ప్రస్తావన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
Read also-రెమ్యునరేషన్ వివాదం.. సొంత బ్యానర్ ప్రకటిస్తూ షాకిచ్చిన అజిత్!
ఈ సందర్భంగా చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో డూప్ లేకుండా చేసిన రిస్కీ స్టంట్స్, దానిపై తన తండ్రి వెంకట్రావు నాటి ఆందోళనను గుర్తుచేసుకున్నారు. “నేను రిస్క్లు చేస్తుంటే మా నాన్న కంగారుపడుతూ.. ‘నీ భార్య కడుపుతో ఉంది. రేపు నీకో మగబిడ్డ పుట్టి, వాడు సినిమాల్లోకి వచ్చి ఇలాంటి రిస్కీ షాట్లు చేస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో!’ అన్నారు. ‘పెద్ది’ సినిమాతో మా నాన్న అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి” అని చిరు ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్లో చరణ్ కంటికి తీవ్ర గాయమై 8 కుట్లు పడ్డాడని, గోల్డెన్ స్పూన్తో పుట్టినా చరణ్ ఇంతలా కష్టాన్ని నమ్ముకుని రిస్క్ చేయడం చూసి ఒక తండ్రిగా తన గుండె ఆగిపోయినంత పనైందని చెప్పారు. థియేటర్లో ఎక్కడా చరణ్ కనిపించలేదని, ఆ పాత్రలోనే జీవించాడని, అందుకే ఇకపై తను కేవలం రామ్ చరణ్ కాదు.. ‘చరణ్ జీవి’ అంటూ కొనియాడారు.
ఇదే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ రామ్ చరణ్ను ప్రత్యేకంగా ప్రశంసించిన విషయాన్ని చిరంజీవి గర్వంగా ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ రామ్ చరణ్కు ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అనే సరికొత్త ట్యాగ్ను ఇచ్చారని, ఇది తమ కుటుంబానికే కాక తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. నా పిల్లలు నన్ను మించి ఎదిగినప్పుడు వచ్చే ‘పుత్రోత్సాహం’ ఇదేనని, ఇకపై చరణ్ ముందు నడుస్తుంటే వెనుక నుండి చూసి మురిసిపోతానని చిరు చెప్పుకొచ్చారు. మట్టి మనుషుల కథను నమ్మి అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు సనకు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు మెగాస్టార్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.