HBD Boyapati Sreenu: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. ఎంతోమంది హీరోలకు లక్కీ డైరెక్టర్ గా మారిపోయారు బోయపాటి శ్రీను. క్లాస్, మాస్, ఫ్యామిలీ, ఎమోషన్..ఇలా ఎలిమెంట్ ఏదైనా సరే దానిని పీక్స్ లో చూపించడంలో బోయపాటి స్టైల్ చాలా ప్రత్యేకం. పదుల సంఖ్యలో డైరెక్టర్స్ మధ్య తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న బోయపాటి.. హీరో ఎవరైనా సరే బోయపాటి సినిమా వస్తుందంటే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సృష్టించుకున్న మాస్ కా బాస్ అని చెప్పవచ్చు. కమర్షియల్ మీటర్ లో తిరుగులేని రేసర్గా దూసుకుపోతున్న బోయపాటి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు మనకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1971 ఏప్రిల్ 25న గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో లింగయ్య – సీతారావమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా.. వారిలో శ్రీను మూడవ సంతానం. తండ్రి లింగయ్య వ్యవసాయం చేస్తూ ఉండగా.. అన్నయ్య బ్రహ్మానందం ఫోటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు. తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను పెదకాకాని లోనే పూర్తి చేసిన బోయపాటి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు గుంటూరు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజీలో పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో అన్నయ్య ఫోటోగ్రఫీ స్టూడియో నిర్వహణలో సహాయం చేసిన ఈయన ఈనాడు పత్రిక విలేకరిగా పనిచేశాడు. డిగ్రీ పూర్తయ్యాక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో హిస్టరీ పూర్తి చేసిన బోయపాటి శ్రీను చదువుకుంటూనే స్టూడియో పనులు, వార్త రచనల్లో తల మునకలుగా ఉండడంతో సినిమాలపై పెద్దగా ఆసక్తి కలగలేదట.
ALSO READ:ఓటీటీలోకి ది కేరళ స్టోరీ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?
కానీ సమీప బంధువైన పోసాని కృష్ణ మురళి ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి.. కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇక అదే సమయంలో సినిమాల పైన ఆసక్తి పెరిగింది. ఒక మంచి మాస్ కథను 2003లో తయారు చేసుకున్నాడు. అప్పుడే కొత్తగా హీరోగా నిలదొక్కుకుంటున్న అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి తీయాలని భావించి అల్లు అరవింద్ కి కథ వినిపించాడు. కథ బాగున్నా మొదట్లోనే మాస్ యాక్షన్ గా సినిమాలు తీస్తే కొత్తగా హీరోగా ఎదుగుతున్న అల్లు అర్జున్ మళ్లీ లవ్ స్టోరీలు చేయడానికి వీలుండదని భావించి ఆమోదించలేదు. కానీ వేరే హీరోని పెట్టి చేస్తే హిట్ అవుతుందని భావించి దిల్ రాజుకు పరిచయం చేశాడు అరవింద్. ఇక ఆయనకు కథ నచ్చడంతో వెంటనే రవితేజకు కథ వినిపించి ఆయన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు చేసి 2005 మే 12న భద్ర పేరిట సినిమాను రిలీజ్ చేయగా.. ఈ సినిమా మంచి విజయం అందుకుంది .
ఇక తర్వాత తులసి , సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక , వినయ విధేయ రామ, అఖండ, స్కంద , అఖండ 2 ఇలా పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్నారు బోయపాటి. తన అద్భుతమైన దర్శకత్వం మెలకువలతో 2014లో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు( లెజెండ్ మూవీ కి) లభించగా.. 2016లో బి.ఎన్.రెడ్డి నేషనల్ అవార్డు, టిఆర్ఎస్ నేషనల్ అవార్డులు కూడా ఈయనకు లభించాయి. ఇకపోతే దర్శకుడు బోయపాటి శ్రీను తో పనిచేసిన కొంత మంది హీరోలు మంచి విజయాలను సొంతం చేసుకున్నారు..