Duvvada Srinivas : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసినా, ఆ షో చుట్టూ ఉన్న వివాదాలు మాత్రం ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. ముఖ్యంగా చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఎలిమినేషన్ గురించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల నిలిచి చరిత్ర సృష్టించారు. అయితే, ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక తుపానులా దూసుకొచ్చిన కంటెస్టెంట్ రమ్య మోక్ష. ఆమె ప్రయాణం కేవలం రెండు వారాలకే పరిమితం కావడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వచ్చింది ..వెళ్ళింది
అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష, ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టింది. ఫిజికల్ టాస్క్లలో మగ కంటెస్టెంట్లకు దీటుగా ఆడుతూ, భరణి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్నే ఈడ్చి పడేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆమె మాట తీరు, తోటి కంటెస్టెంట్లపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆమెకు నెగటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కళ్యాణ్ పడాల – తనూజల మధ్య రిలేషన్పై చేసిన కామెంట్స్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆమె త్వరగానే ఎలిమినేట్ అయ్యింది.
రమ్య ఎలిమినేషన్పై ఫైర్
రమ్య ఎలిమినేషన్పై తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. రమ్య మోక్షకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీరని అన్యాయం చేసింది. ఆమె కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. తన కాళ్ల మీద తాను నిలబడిన ధైర్యవంతురాలు. అనవసరమైన వారిని అక్కడ ఎక్కువ రోజులు ఉంచి, రమ్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ను తొందరగా పంపించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆత్మహత్యలకు పాల్పడే యువత రమ్య లాంటి వారిని చూసి నేర్చుకోవాలని, తండ్రి మరణం వంటి బాధలను దిగమింగి ఎలా పోరాడాలో ఆమె నిరూపించిందని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
దివ్వెల మాధురి మద్దతు
రమ్య పికిల్స్ కాంట్రవర్సీ , మాటల యుద్ధంపై స్పందిస్తూ, దువ్వాడ శ్రీనివాస్ ,దివ్వెల మాధురి ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎదుటివారు అవమానకరంగా మాట్లాడినప్పుడే రమ్య అలా స్పందించి ఉంటుందని, ఆమెకు ప్రతి విషయాన్ని ఎదిరించే ధైర్యం ఉందని వారు కొనియాడారు. రమ్య ఫైనల్ వరకు ఉండాల్సిన క్యారెక్టర్ అని, ఆమె గెలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారని మాధురి అభిప్రాయపడ్డారు.