Sarpanch Elections: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలం, రుప్లా నాయక్ తండాలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. ఎలాంటి పోటీ లేకుండా గ్రామస్తులు తమ సర్పంచ్ను ఎన్నుకోవడమే కాదు.. వెంటనే గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు. రుప్లా తండా గ్రామంలో సుమారుగా 502 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామ తండాను అభివృద్ధి చేసి తీరుతానని గ్రామ పెద్దల ముందు జవహర్ లాల్ నాయక్ ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలు, పార్టీల సంబంధం లేకుండా.. అతీతంగా ఏకతాటిపై నిలిచారు.
గ్రామానికి చెందిన పెద్దమనిషిగా.. ప్రజలందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా జవహర్ లాల్ నాయక్ ఉన్నారు. ఈ కారణాన ఆయనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు, ప్రజలు తెలిపారు. దీంతో రుప్లా తండా పంచాయతీ జిల్లాలోనే మొట్టమొదటి ఏకగ్రీవ పంచాయతీగా నిలిచింది. ఈ ఏకగ్రీవ నిర్ణయం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ ను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా జవహర్ లాల్ నాయక్ మాట్లాడుతూ… పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పంచాయతీకి మొదటి విడుతలో ఎన్నికలు జరుగుతుండడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. గ్రామస్తులు ముందుగా అనుకున్న మాట ప్రకారం, నామినేషన్లు ఎవరూ వేయకుండా ఈ ఏకగ్రీవం ప్రక్రియను కొనసాగిస్తారో లేదో చూడాలి.
ALSO READ: Himalayan Royal Enfield: రోడ్డుపై ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ మొదలైతే… గాలి కూడా పక్కకు తప్పుకోవాలి