Dragon Glimpse: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ మరియు గ్లింప్స్ను ‘డ్రాగన్’ (Dragon) పేరిట విడుదల చేశారు. ఊహించినట్లుగానే ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ థీమ్, మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్స్తో కూడిన ఒక పవర్ఫుల్ యాక్షన్ వరల్డ్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
Read also-‘పెద్ది’ విడుదలకు లైన్ క్లియర్.. పర్సంటేజ్ సిస్టమ్పై ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయాలు!
ఈ గ్లింప్స్ ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కథా నేపథ్యాన్ని చాలా ఇంటెన్సివ్గా చూపించారు. బ్రిటీష్ వారు భారతదేశానికి కేవలం వ్యాపారం కోసం రాలేదని, వారు ఇక్కడే 250 ఏళ్లపాటు తిష్ట వేయడానికి అసలు కారణం ‘ఓపియమ్ పాపీ’ (నల్లమందు మొక్క) అని వాయిస్ ఓవర్ ద్వారా రివీల్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, వ్యసనపరుడైన ‘హెరాయిన్’ తయారీ సామ్రాజ్యం చుట్టూ ఈ కథ తిరగబోతోందని స్పష్టమవుతోంది. 1947లో బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ నల్లమందు వ్యాపారం ‘ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, ‘ది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’గా విడిపోయిందని, ఆ తర్వాతే అసలైన ‘ఓపియమ్ వార్స్’ (నల్లమందు యుద్ధాలు) మొదలయ్యాయని గ్లింప్స్లో చూపించారు.
బైబిల్ గ్రంథంలోని సృష్టి క్రమాన్ని వాడుకుంటూ విలనిజాన్ని ఎలివేట్ చేసిన విధానం గూస్బంప్స్ తెప్పిస్తుంది. దేవుడు ఆరు రోజుల్లో భూమిని, ఆకాశాన్ని, మనుషులను సృష్టించి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడని.. ఆ తర్వాతే ‘డెవిల్’ (సాతాను) పుట్టాడంటూ సాగే డైలాగ్స్ సినిమాలో విలన్ల క్రూరత్వాన్ని కళ్లకు కట్టాయి.
ఈ క్రమంలో వచ్చే.. “ట్రిగ్గర్ నొక్కిన తర్వాత బాధపడకపోవడమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. నా కలలో చనిపోయిన వారి ముఖాలు కనిపించవు.. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనిపిస్తాయి” అనే పవర్ఫుల్ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ డైలాగ్స్ సినిమా ఏ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. విలన్ల అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు వారిని అంతం చేయడానికి వచ్చే హీరో పాత్ర చుట్టూ ఈ డ్రాగన్ కథ నడవనుంది.
Read also-మంచు మనోజ్ బర్త్డే స్పెషల్.. ‘ఐక్య’ ట్రస్ట్, సినిమాలు, రాజకీయాలపై క్రేజీ అప్డేట్స్!
ఈ భారీ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన మార్క్ లౌడ్ అండ్ ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM)తో గ్లింప్స్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మొత్తానికి ఈ గ్లింప్స్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి ‘డ్రాగన్’ సిద్ధమవుతోందని నిరూపించింది.