Kangana Advice: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వివాహితల ఆత్మహత్యలు, వరకట్న వేధింపుల కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ భారతీయ సమాజంలోని కొన్ని రుగ్మతలపై మరియు వివాహ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఒక యువతి వరకట్న ఆత్మహత్య ఉదంతంపై స్పందిస్తూ, యువతులకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని మరియు కీలక సలహాను ఇచ్చారు.
భోపాల్ ఘటన నేపథ్యం
భోపాల్లో 33 ఏళ్ల ఒక చదువుకున్న వివాహిత తన అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. నోయిడాకు చెందిన ఆమె కుటుంబ సభ్యులు.. భర్త సమర్థ్, అత్త (రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్) లపై వరకట్న వేధింపులు, హత్య ఆరోపణలు చేయడంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. నిందితులను విచారించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) కూడా ఏర్పాటు చేశారు. సదరు మహిళ చనిపోయే ముందు రాత్రి కూడా తన పుట్టింటి వారితో ఫోన్లో మాట్లాడిందని, అత్తగారింట్లో నరకం చూస్తున్నానని, భోపాల్ వదిలి నోయిడా వచ్చేస్తానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ సమాజంపై కంగనా విమర్శలు
“ఈ మధ్యకాలంలో వివాహితలైన యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘోరమైన వార్తలు రోజూ వింటున్నాం. వీరిలో చాలామంది బాగా చదువుకున్నవారే. తాము అనుభవిస్తున్న ఊపిరాడని నరకం నుండి బయటపడేయాలని, ఏదైనా ఘోరం జరగడానికి ముందే తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ మన భారతీయ సమాజానికి ఒక చెడ్డ అలవాటుంది… ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించాక తల్లిదండ్రులు, సమాజం వారిని పూర్తిగా వదిలేస్తారు. పెళ్లయిన అమ్మాయికి పుట్టింటి తలుపులు మూసుకుపోయాయనే భావన కల్పిస్తారు” అని కంగనా విమర్శించారు.
యువతులకు కంగనా ఇచ్చిన సలహాలు
ఈ రకమైన దారుణాల నుండి యువతులు తమను తాము కాపాడుకోవడానికి కంగనా కొన్ని కీలక సూచనలు చేశారు. ఏ సోషల్ మీడియా లేదా ఫ్యాషన్, డేటింగ్, వెడ్డింగ్, మేకప్ పరిశ్రమలు మీకు చెప్పని ఒక నిజాన్ని నేను చెప్తున్నాను. మీ జీవితంలో అన్నిటికంటే మీ కెరీర్ మాత్రమే అత్యంత ముఖ్యం. అమ్మాయిలు ముందుగా చదువుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలి. ఆర్థిక స్వతంత్రత వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి. మిమ్మల్ని రక్షించడానికి ఏ సూపర్ హీరో రాడు. మీ జీవితానికి మీరే హీరో అవ్వాలి. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారనే దానికంటే, సమాజంలో మీ గుర్తింపు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇతరుల మాటలకు లొంగిపోకుండా మీకు నచ్చిన జీవితాన్ని మీరే నిర్మించుకోండి.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుండి బిజెపి ఎంపీగా కొనసాగుతున్న కంగనా రనౌత్, ఇటీవల చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సామాజిక అంశాలపై ఎప్పుడూ బోల్డ్గా మాట్లాడే కంగనా.. యువతుల స్వయంసమృద్ధిని కాంక్షిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.