Kurchee Thatha: సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్తో రాత్రికి రాత్రే సెన్సేషన్ సృష్టించి, వెండితెరపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్టెప్పులేసిన ‘కుర్చీ తాత’ (మహ్మద్ పాషా) ఇకలేరు. ఈ వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, మీమ్ క్రియేటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఉదయం ఎప్పటిలాగే కృష్ణకాంత్ పార్కుకు వెళ్లిన ఆయన, అక్కడ నడుస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఆయన పార్కులోనే కుప్పకూలిపోయారు. అక్కడున్న వారు గమనించి ఆయనకు CPR చేసే లోపే ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉండటంతో, తీవ్రమైన ఎండలు లేదా వడదెబ్బ కారణంగానే ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పార్క్ సిబ్బంది సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
కుర్చీ తాత లైఫ్ జర్నీ ఎంతో విచిత్రమైనది. ఒక సాధారణ వ్యక్తి డిజిటల్ యుగంలో ఏ రేంజ్ సెలబ్రిటీ అవ్వగలడో ఆయన నిరూపించారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కోపంతో ఆయన అన్న “కుర్చీ మడతపెట్టి…” అనే డైలాగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆడియో రీల్స్గా మారి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఈ క్రేజ్ చూసి దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలో ఈ డైలాగ్ను మెయిన్ లిరిక్గా పెట్టి పాట డిజైన్ చేశారు. ఆ పాట ప్రోమోలో కుర్చీ తాత స్వయంగా మహేష్ బాబుతో కలిసి డ్యాన్స్ చేసి థియేటర్లలో జాతర తెచ్చారు.
Read also-‘పెద్ది’ రిలీజ్ ముందు టాలీవుడ్లో పర్సంటేజ్ చిచ్చు.. సునీల్ నారంగ్ అవుట్..అసలు కారణం అదేనా?
సినిమా సమయంలో చిత్ర యూనిట్ ఆయనకు కొంత ఆర్థిక సహాయం చేసింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్లు కూడా ఆయనతో ఇంటర్వ్యూలు చేసి వ్యూస్ తెచ్చుకున్నాయి. కానీ, ఆ క్రేజ్ తగ్గాక సోషల్ మీడియా ప్రపంచం ఆయనను మర్చిపోయింది. దాంతో ఆయన మళ్లీ కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో భిక్షాటన చేసుకుంటూ పాత జీవితానికే పరిమితం కావాల్సి వచ్చింది. తమ మీమ్స్, రీల్స్ ద్వారా కోట్లాది మంది నెటిజన్లను నవ్వించిన ఒక ఐకాన్ ఇలా కృష్ణకాంత్ పార్కులోనే నడుస్తూ ప్రాణాలు కోల్పోవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మీమర్స్, మహేష్ బాబు అభిమానులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.