Vijayashanti:లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే అలవోకగా పోషిస్తూ.. ఎంతో మందిని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యాక్షన్ పర్ఫామెన్స్ లో అదరకొట్టేసింది కూడా.. పైగా ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి దిగ్గజ హీరోలకి కూడా పోటీ ఇచ్చింది అంటే ఈమె నటన ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు కోటి రూపాయలు అందుకున్న తొలి హీరోయిన్గా కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది విజయశాంతి.
కెరియర్ పీక్స్ లో వుండగానే రాజకీయాల్లోకి వెళ్లిపోయి బిజీగా మారిపోయింది. కానీ కొన్నిళ్లకు మళ్ళీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. అబ్బురపరిచిన ఈమె ఆ సమయంలో కూడా తన నటనకు ఎవరూ సాటిరారు అని నిరూపించింది. ఇకపోతే మళ్లీ మరో సినిమాలో నటించలేదు విజయశాంతి. కానీ ఇన్నేళ్ల తర్వాత జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకత్వం వహించిన కర్మాఖ్య సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సడన్గా ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈవెంట్ వేదికగా ఎన్నో విషయాలను పంచుకున్న విజయశాంతి.. తన మొదటి రెమ్యునరేషన్ విషయంలో తనకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరి విజయశాంతి ఏం చెప్పారు ? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ALSO READ:జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?
విజయశాంతి కర్మాఖ్య మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికగా మాట్లాడుతూ..” నా మొదటి పారితోషకం రూ.5000 మాత్రమే. అయితే అందులో నాకు కేవలం రూ.3000 మాత్రమే ఇచ్చారు. మరో రూ.2000 మోసపూరితంగా కాజేశారు. ఇలాంటి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా సరే నేను కష్టపడి పని చేస్తూనే.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ సెలబ్రిటీలలో ఒకరిగా ఎదిగాను. చివరికి కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నాను. 90వ దశకం ప్రారంభంలో ఒక మహిళా నటి.. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం నాకు గర్వంగా అనిపించింది. అంతేకాదు నా కెరియర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దిగ్గజ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ తో పాటు భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే తారలలో ఒకరిగా నన్ను పరిగణించేవారు ” అంటూ విజయశాంతి తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.
మరొకవైపు ఇదే ఈవెంట్ లో మాట్లాడుతూ.. “చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచీ మరింత ప్రోత్సాహం అవసరం. మంచి కథలు, కొత్త ఆలోచనలతో వచ్చే చిన్న చిత్రాలకు తగిన గుర్తింపు లభిస్తే.. తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుంది. చిన్న సినిమాల్లోనే దమ్ము ఉంటుంది” అంటూ విజయశాంతి తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.