Film industry:గత వారం రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న భానుప్రియ తల్లి ఎం లక్ష్మి గుండెపోటుతో మరణించగా.. నిన్నటికి నిన్న యంగ్ మోడల్ కం యాక్ట్రెస్ హర్షాలీ కాలియా రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ రెండు మరణాలను అభిమానులు మరవకముందే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు 71 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మరి ఆయన ఎవరు? ఆయన మరణానికి గల కారణం ఏమిటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మలయాళ నాటక సినీ రంగంలో ప్రముఖ నటుడిగా , దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈ. ఏ. రాజేంద్రన్ (EA Rajendran) కన్నుమూసారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. కొల్లం లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు . నేషనల్ స్కూల్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అయిన రాజేంద్రన్ కేరళలోని ప్రసిద్ధ నాటక సంస్థ కాళిదాస కళా కేంద్రంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కేరళ నాటక సాంస్కృతి రంగానికి ఇది తీరనిలోటు అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఈయన మరణానికి సినీ సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Band Melam movie review: ‘బ్యాండ్ మేళం’ రివ్యూ : ‘ఉయ్యాలా జంపాలా’ స్పూఫ్ మాదిరి!
రాజేంద్రన్ విషయానికి వస్తే.. సుమారుగా 60కి పైగా మలయాళ చిత్రాలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా నరసింహం, కలియాట్టం , మీశమాధవన్ వంటి సూపర్ హిట్ సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. ఇక ఈయన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముఖేష్ కు స్వయానా బావగారు అవుతారు. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు దివ్య దర్శన్ కూడా చిత్ర పరిశ్రమలో నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇకపోతే రాజేంద్రన్ పార్థివ దేహాన్ని రేపు త్రిశూర్ జిల్లాలోని త్రిత్తలూర్ కి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.