Naga Vamsi Movies : టాలీవుడ్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ పరిచయం అవసరం లేని పేరు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2014 వచ్చిన ‘లవర్’ సినిమాతో నిర్మాతగా మారాడు. తర్వాత 2016 లో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అనే బ్యానర్ ను స్థాపించి వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.
‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అనేది కంప్లీట్ గా దర్శకుడు త్రివిక్రమ్ కోసమే అన్నట్టు ఉంచేశారు. ఆ బ్యానర్లో ఓన్లీ త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే రూపొందుతాయి. మిగిలిన దర్శకులతో చేసే సినిమాల కోసం ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అన్నమాట. టాలీవుడ్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మించే సంస్థగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నిలిచింది. అందుకోసం నాగవంశీ చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండటం వల్ల నాగవంశీ రేంజ్ కూడా పెరుగుతూ వచ్చింది. అలా.. టాలీవుడ్లో స్టార్ నిర్మాతగా నిలదొక్కుకున్నాడు.
అయితే నాగవంశీ ఒక్కోసారి ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటాడు. అది అతనికి కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో అతనికి ఆటిట్యూడ్ ఎక్కువ అని అంతా అనుకుంటారు. దాన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో అతనికి ఆటిట్యూడ్ చింటూ అనే బిరుదు ఇచ్చేశారు నెటిజెన్లు. నాగవంశీకి ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే.. అతని ఓవర్ కాన్ఫిడెన్స్. తన సినిమాల ప్రమోషన్స్ లో అతను ఇచ్చే కొన్ని స్టేట్మెంట్లు సినిమాల రిజల్ట్స్నే మార్చేశాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు.
ఉదాహరణకి ‘గుంటూరు కారం’ విషయాన్నే తీసుకుందాం.. ఈ సినిమా గురించి ‘ప్రతి ఏరియాలోనూ రాజమౌళి నంబర్స్కి దగ్గరగా వెళ్ళిపోతాం’ అంటూ నాగవంశీ చెప్పడం జరిగింది. కట్ చేస్తే.. రిలీజ్ రోజున ఆ రేంజ్లో సినిమా లేదని జనాలు తేల్చేశారు. చివరికి అది యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది.
తర్వాత ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేస్తూ.. ‘హిందీ నెట్ కంటే తెలుగు నెట్ ఒక రూపాయి ఎక్కువ ఉండాలి. హృతిక్ రోషన్ ని టాలీవుడ్లో లాంచ్ చేసినట్టు అంతా చెప్పుకోవాలి’ అంటూ మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు నాగవంశీ..! ఆ సినిమా ఫలితం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాదు తన ‘మాస్ జాతర’ సినిమా కోసం ‘మిస్టర్ బచ్చన్’ పై కూడా విమర్శలు గుప్పించాడు నాగవంశీ. తర్వాత ‘మాస్ జాతర’ ఫలితం ఏమైందో తెలుసు కదా.
ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకున్నాడు నాగవంశీ. విషయం ఏంటంటే.. 2026 సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న విజయ్ ‘జన నాయకుడు’ ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు నాగవంశీ. అయితే అదే రోజున ప్రభాస్ ‘ది రాజాసాబ్’ కూడా రిలీజ్ కానుంది. పండగ టైంలో డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ స్పేస్ ఉండదు. అయినా సరే నాగవంశీ వంటి పెద్ద నిర్మాత డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని కొందరు భావిస్తున్నారు.
మరికొంతమంది అయితే ‘హరిహర వీరమల్లు’ కోసం ‘కింగ్డమ్’ సినిమాని చాలా సార్లు వాయిదా వేశాడు నాగవంశీ. ఒకసారి ‘కళ్యాణ్ గారి సినిమాకి ఇబ్బంది కలుగకూడదు అని ‘కింగ్డమ్’ ప్రమోషన్స్ ఎక్కువ చేయలేదు’ అంటూ స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇచ్చిన వాల్యూ ప్రభాస్ సినిమాకి ఎందుకు ఇవ్వడం లేదు నాగవంశీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి నాగవంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.