NBK 111 : నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే మాస్ మూవీ వచ్చింది. 2023 జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. #NBK111 వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు నేడు రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకి 2,3 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన సీనియర్ స్టార్ దర్శకులు బి.గోపాల్ తో సహా, ‘సితార’ నాగవంశీ, ‘మైత్రి’ రవి వంటి పలువురు స్టార్స్ విచ్చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘పెద్ది’ నిర్మాత అయినటువంటి ‘వ్రిద్ది సినిమాస్’ వెంకట్ సతీష్ కిలారు బాలయ్య-గోపీచంద్ కాంబోలో రూపొందుతున్న ఈ రెండో ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. ఇదే సందర్భంలో #NBK111 వరల్డ్ ను పరిచయం చేస్తూ ఓ వైవిధ్యమైన పోస్టర్ ను రివీల్ చేశారు. ఇందులో 2 డిఫరెంట్ లుక్స్ లో బాలయ్య కనిపిస్తున్నారు. ఒక లుక్లో పవర్ ఫుల్ కింగ్ గా కనిపిస్తున్నారు.
ఇంకో లుక్లో మేడలో రుద్రాక్షమాల ధరించి పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఛారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని హింట్ ఇచ్చినట్టు అయ్యింది. అంతా బాగానే ఉంది కానీ.. దర్శకుడు గోపీచంద్ మలినేనిలో అంత విషయం ఉందా? అనే ప్రశ్న అందరినీ కలవరపరుస్తోంది. అందుకు కారణాలు సైతం లేకపోలేదు.
అసలు విషయం ఏంటంటే.. గోపీచంద్ మలినేని ఇప్పటివరకు తీసింది మాస్ సబ్జెక్టులే. ‘డాన్ శీను’ నుండి మొన్నొచ్చిన ‘జాట్'(హిందీ సినిమా) వరకు గోపీచంద్ మలినేని అలాంటి సినిమాలే తీశారు. రవితేజతో తీసిన ‘డాన్ శీను’ ‘బలుపు’ ‘క్రాక్’ వంటివి తీసేస్తే రామ్ తో చేసిన ‘పండగ చేస్కో’, సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘విన్నర్’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’ కూడా కొత్తగా ఏమీ ఉండదు. అది బాలకృష్ణ రెగ్యులర్ హిట్ ఫార్ములా సినిమాలనే ఉంటుంది. ఆ సినిమా టేకింగ్ కూడా దర్శకుడు బోయపాటి శ్రీను స్టైల్లోనే ఉంటుంది. మరి అలాంటి మలినేని…. బాలకృష్ణతో ఛారిత్రాత్మక సినిమా తీసేంత కంటెంట్ ఉన్నోడా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. పంధా మార్చి కొత్తగా చేస్తే మంచిదే. కాదు అని అలవాటు లేని జోనర్ ని టచ్ చేస్తే… మొదటికే మోసం వస్తుంది. కాబట్టి.. గోపీచంద్ ఈ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.
బడ్జెట్ వంటివి కూడా శృతి మించకుండా చూసుకోవాలి. లేదు అంటే రవితేజతో మైత్రిలో అతను చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయిందో…, ఈ ప్రాజెక్టు కూడా అలా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు నుండి సుధాకర్ చెరుకూరి కూడా తప్పుకున్నట్టు ప్రచారం మొదలైంది.